ఎల్‌బీనగర్‌ వ్యభిచారం గుట్టురట్టు

18 Mar, 2021 08:41 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిర్వాహకులు, విటులు  

యువతులను రెస్క్యూహోం తరలించిన పోలీసులు  

సాక్షి, నాగోలు: ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి ఎదురుగా ఉన్న సాయిదుర్గా లాడ్జ్‌లో విదేశాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ టీమ్, ఎల్‌బీనగర్‌ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న సాయిదుర్గా లాడ్జ్‌ యజమాని దేశినేని వెంకటేశ్వరరావు (52)ను అరెస్టు చేశారు. లాడ్జ్‌కు నెలకు రూ.75 వేల చొప్పున అద్దె కడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అతడితో పాటు వెస్ట్‌బెంగాల్‌కు చెందిన సాకిజాన్‌ కాటన్‌ అలియాస్‌ దీపిక అలియాస్‌ రేష్మ (30), పంచాయతీరాజ్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మండ్ల అవినాష్‌ (32), మీర్‌పేటకు చెందిన గుగులోతు సుజాత (27)లను అరెస్టు చేశారు. అదే విధంగా విటులు కుమావత్‌ పంచారాం (38), సిర్ర మనీష్‌ (25), ఆవులదొడ్డి మధు (30) మధ్యప్రదేశ్‌కు చెందిన వికాస్‌ కుమార్‌సాకేత్‌ (22)లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు రవి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. లాడ్జ్‌లో పట్టుబడిన నలుగురు యువతలను రెస్క్యూహోంకు తరలించారు. బంగ్లాదేశ్‌తో పాటు దేశంలోని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తెలింది. 

మరిన్ని వార్తలు