9 బృందాలు.. 36 గంటలు 

6 Jun, 2021 06:17 IST|Sakshi
బిడ్డను తల్లి రేణుకమ్మకు అందిస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప, చిత్రంలో డీఎస్పీ వినోద్‌కుమార్‌

ఆదోనిలో శిశువు అపహరణ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు 

ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలో శిశువు అపహరణ మిస్టరీని తొమ్మిది బృందాల సాయంతో 36 గంటల్లో ఛేదించగలిగామని ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు. ఆదోనిలో శనివారం పసికందును తల్లిదండ్రులు రేణుకమ్మ, శ్రీనివాసులుకు అందించారు. చంటి బిడ్డకు ‘దిశ’గా నామకరణం చేసి ఆశీర్వదించారు. అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ తెలిపిన వివరాలు ఇవీ.. మండగిరికి చెందిన కనకుర్తి ఝాన్సీలక్ష్మి (30), మంజునాథ దంపతులకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

ఆడపిల్ల కావాలనే కోరికతో దత్తత తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఈనెల 3న ఎస్కేడీ కాలనీలోని ప్రైవేట్‌ నర్సిగ్‌హోమ్‌ వద్దకు వచ్చి ఆయాగా పని చేస్తున్న యశోదను ఝాన్సీలక్ష్మి సంప్రదించింది. ఆ సమయంలో అలసందగుత్తికి చెందిన పూజారి రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసింది. దీంతో ఝాన్సీలక్ష్మి బురఖా ధరించి, టీకా పేరుతో డ్రామా నడిపి పసిబిడ్డను అపహరించింది. ఫోన్‌ సంభాషణ ఆధారంగా పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.  

మరిన్ని వార్తలు