విజయవాడ హైవేపై ప్రమాదం.. ప్రైవేట్‌ బస్సులు ఢీ, నలుగురి పరిస్థితి విషమం!

12 Jan, 2023 07:12 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకదానిని మరొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. 

చౌటుప్పల్ మండలం గుండ్లబావి వద్ద హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్-65 పై ఈ ఘటన జరిగింది. రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులు మైత్రి ట్రావెల్స్‌, ఆరంజ్‌ ట్రావెల్స్‌ బస్సులుగా నిర్ధారణ అయ్యింది.

ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని ప్రాథమిక విచారణ ద్వారా పోలీసులు వెల్లడించారు. పదహారు మందికి స్వల్ప గాయాలు కాగా, మరో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలై విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు.

మరిన్ని వార్తలు