భార్య మీద అనుమానం.. 3 నెలలుగా 30కేజీల ఇనుప చైన్‌తో..

1 Jul, 2021 10:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాజస్తాన్‌లో వెలుగు చూసిన దారుణం

భార్యమీద అనుమానంతో మూడు నెలలుగా కట్టేసి చిత్రహింసలు

జైపూర్‌: అనుమానం పెనుభూతమైతే బంధాలు అదృశ్యమవుతాయి. ఇక భార్యభర్తల మధ్య అనుమానం మొదలైతే ఆ బంధం అక్కడితో ముగిసిపోతుంది. భార్యను చిత్రహింసలకు గురి చేస్తాడు భర్త. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. భార్య మీద అనుమానంతో భర్త ఆమెను గత మూడు నెలలుగా ఇనుప చైనుతో బంధించి చిత్రహింసలకు గురి చేయసాగాడు. విషయం పోలీసులు దృష్టికి చేరడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. 

రాజస్తాన్‌ ప్రతాప్‌గఢ్‌ జిల్లాకు చెందిన బాధితురాలు(40), తరచుగా పుట్టింటికి వెళ్లేది. పొలం పనుల్లో తల్లికి సాయం చేసేది. భార్య ఇలా తరచుగా పుట్టింటికి వెళ్తుండటంతో భర్త ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. భార్యకు తల్లిగారి ఊరిలో ఎవరితోనే అక్రమం సంబంధం ఉందని.. అందుకే తరచుగా అక్కడకు వెళ్తుందని భావించాడు. ఈ క్రమంలో హోలీ పండగకు రెండు మూడు రోజుల ముందు ఇదే విషయమై భార్యతో గొడవపడ్డాడు. వివాదం కాస్త ముదరడంతో ఆగ్రహించిన భర్త దాదాపు 30 కేజీల బరువుండే ఇనుప గొలుసుతో ఆమెను బంధించి ఉంచి.. చిత్రహింసలకు గురి చేయసాగాడు. 

వృద్ధురాలైన తన తల్లికి సాయం చేయడానికే తాను పుట్టింటికి వెళ్తున్నానని భార్య చెప్పినప్పటికి అతడు వినలేదు. ఇప్పటికి మూడు నెలలుగా బాధితురాలిని కట్టేసి ఉంచాడు. దీని గురించి ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని బాధితురాలిని కాపాడారు. ఆమె భర్తను అరెస్ట్‌ చేవారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. ‘‘పుట్టింటికి వెళ్లిన ప్రతి సారి నా భర్త అక్కడకు వచ్చి గొడవ చేసేవాడు. నా కుటుంబ సభ్యుల ముందే నన్ను కొట్టేవాడు. ఈ సారి ఏకంగా మూడు నెలల నుంచి నన్ను ఇనుప గొలుసుతో కట్టేసి.. హింసించడం ప్రారంభించాడు’’ అని తెలిపింది. 

చదవండి: అనుమానం; ఎలాగైన భార్యను చంపేయాలని పక్కా ప్లాన్‌తో!

మరిన్ని వార్తలు