‘ముత్తూట్‌’ దొంగలు దొరికారు

24 Jan, 2021 03:57 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. చిత్రంలో ఇతర పోలీసు అధికారులు

తమిళనాడులో శుక్రవారం 25 కిలోల నగల దోపిడీ

24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న తెలంగాణ పోలీసులు

హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్ర పారిపోతుండగా అరెస్ట్‌

రూ. 7.5 కోట్ల విలువైన ఆభరణాలు, రూ. 93 వేల నగదు స్వాధీనం

7 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం, 13 సెల్‌ఫోన్లు కూడా...

అరెస్టు వివరాలు మీడియాకు వివరించిన సైబరాబాద్‌ సీపీ    

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడులో శుక్రవారం సినీఫక్కీలో భారీ దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తెలంగాణ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చాకచక్యంగా పట్టుకున్నారు. కృష్ణగిరి జిల్లా హోసూర్‌లో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోకి చొరబడి సిబ్బందిని తుపాకులతో బెదిరించి సుమారు రూ. 7.5 కోట్ల విలువజేసే 25 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 93 వేల నగదు కొట్టేసిన దోపిడీ దొంగలు తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్ర పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి 25 కిలోల బంగారు ఆభరణాలు, ఏడు తుపాకులు, 13 సెల్‌ ఫోన్లు, రూ. 93 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన వాహనాలను సీజ్‌ చేశారు. తమిళనాడు పోలీసులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ కేసు వివరాలను కృష్ణగిరి ఎస్పీతో కలసి గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ శనివారం మీడియాకు తెలిపారు.
లూ«థియానాలో విఫలయత్నం...

హోసూర్‌లో సక్సెస్‌
మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్, శంకర్‌సింగ్‌ బయ్యాల్‌ బాగల్, రూప్‌సింగ్‌ బాగల్, సుజీత్‌సింగ్, సౌరభ్, రోషన్‌సింగ్‌లు సులువుగా డబ్బు సంపాదించేందుకు నేరాలబాట పట్టారు. గతేడాది అక్టోబర్‌లో పంజాబ్‌లోని లూథియానాలో ఉన్న ఓ ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో వారు దోపిడీకి యత్నించగా సుజీత్‌సింగ్, సౌరభ్, రోషన్‌సింగ్‌ను అక్కడి ప్రజలు పట్టుకున్నారు. కానీ అమిత్, శంకర్‌సింగ్‌ మాత్రం కాల్పులు జరుపుతూ తప్పించుకొని పరారయ్యారు. ఈసారి ఎలాగైనా దోపిడీని విజయవంతం చేయాలని అమిత్, శంకర్‌సింగ్‌లు రూప్‌సింగ్‌కు చెప్పారు. దీంతో రూప్‌సింగ్, అమిత్‌లు నవంబర్‌లో బెంగళూరు వెళ్లి అక్కడ ఓ గదిలో అద్దెకు దిగారు. దోపిడీ పథకాన్ని తనకు పరిచయమున్న ఆయుధాలు సరఫరా చేసే నాగపూర్‌కు చెందిన లూల్య పాండేకు రూప్‌సింగ్‌ వివరించాడు. జార్ఖండ్‌లో పనిచేసే సమయంలో అమిత్‌కు స్నేహితులైన వివేక్‌ మండల్, భూపేందర్‌ మాంజిలతో ఏర్పడిన పరిచయంతో వారికి కూడా వివరించాడు. చాలా వరకు ముత్తూట్‌ కార్యాలయాల్లోనే రూప్‌సింగ్‌ రెక్కీలు చేశాడు.

కంటైనర్‌ లోపల పరిశీలిస్తున్న సజ్జనార్‌

మరిన్ని వార్తలు