రాక్షస తండ్రి.. కూతురు టెర్రస్‌పై పడుకుంటానని చెప్పడంతో..

1 Jun, 2023 07:58 IST|Sakshi

ఇటీవల చాలామంది చిన్న చిన్న విషయాలకే ఆగ్రహావేశాలకులోనై ప్రాణాలు తీసేంత దారుణాలకు ఒడిగడుతున్నారు. చివరికి కటకటాలపాలై వారిని నమ్మకున్నవారిని నట్టేట ముంచుతున్నారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అసహనంతో చేయకూడని పనులు చేసి నేరస్తులుగా మారుతున్నారు. సూరత్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన ఈ కోవలోనిదే!

వివరాల్లోకెళ్లే.. సూరత్‌లో ఓ వ్యక్తి సత్య నగర్‌ సొసైటీలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడి కుమార్తె టెర్రస్‌పై పడుకునేందుకు వెళ్తానని అడిగింది. ఆ విషయమై ఇంట్లో వాగ్వాదం చోటుచేసుంది. అక్కడ పడుకోవద్దంటూ అతడు తన కూతురుకు కరాకండీగా చెప్పేశాడు. అయినా ఆమె మాటవినకపోవడంతో భార్య, పిల్లలతో గొడవపడ్డాడు.

ఐతే కూతురు తాను టెర్రస్‌పైకే వెళ్తానంటూ మొండిపట్టుతో వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. అతడు తన కూతుర్ని అడ్డుకోవడమే గాక, ఏమాత్రం కనికరం లేకుండా కత్తితో 25 సార్లు దాడి చేసి హతమార్చాడు.

విచక్షణ కోల్పోయిన సదరు వ్యక్తి ఆ తర్వాత భార్యపై దాడి చేసేందుకు యత్నించాడు. ఐతే ఇతర పిల్లలు జోక్యం చేసుకుని అతడిని అడ్డుకున్నారు. ఆ సమయంలో వారు కూడా గాయపడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ దారుణానికి పాల్పడిన నిందితుడిని రామానుజులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. 
(చదవండి: ఘోర ప్రమాదం.. నూతన జంటతో సహా నలుగురు సజీవ దహనం)

మరిన్ని వార్తలు