టీడీపీ మీడియా కో ఆర్డినేటర్‌ అరెస్ట్‌

13 Oct, 2022 04:59 IST|Sakshi

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో అరెస్టు చేసిన సీఐడీ

సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టిన కేసులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని మీడియా కో ఆర్డినేటర్‌ దారపునేని నరేంద్రను సీఐడీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తున్న ఒక మహిళను గన్నవరం విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు సెప్టెంబరు 9న అరెస్టు చేశారు. ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి భార్య అంటూ కొందరు సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. ‘సీఎంవోలోని ఓ కీలక అధికారి భార్య దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడ్డారు.

ఆమెతోపాటు ఎయిర్‌ ఇండియా సిబ్బందిని కస్టమ్స్‌ అధికారులు విచారిస్తున్నారు..’ అంటూ ఉద్దేశపూర్వకంగా సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి ఆ మహిళ ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఏ అధికారి కుటుంబసభ్యురాలు కాదు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకే సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారు. దీనిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియా కో ఆర్డినేటర్‌ దారపునేని నరేంద్ర కూడా ఉద్దేశపూర్వకంగా సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేసినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. నరేంద్ర స్వయంగా దుష్ప్రచార పోస్టులు పెట్టడమేగాక ఆ పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేలా సూపర్‌ స్ప్రెడర్‌గా వ్యవహరించారని, కుట్రపూరితంగానే ఇదంతా చేశారని తేలింది. దీంతో అతడిపై క్రైమ్‌ నంబర్‌ 61/22 కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదే అంశంపై సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేసినం దుకు జర్నలిస్ట్‌ అంకబాబును సీఐడీ అధికారులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు