కౌన్సిలర్‌ ఇంట్లో భారీ చోరీ.. అరకిలో బంగారం మాయం

30 Dec, 2020 12:01 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. అశోక్ నగర్ కాలనీలోని 15వ వార్డ్ కౌన్సిలర్ వనిత రామ్మోహన్ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. గేటు దూకి తాళాలు పగులగొట్టి లోపలికి వచ్చిన దుండగులు.. 52 తులాల బంగారం, 60 తులాల వెండితో పాటు 2 లక్షల రూపాయలు నగదును ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ ఆయ్యాయి. వివరాలు.. కౌన్సిలర్ వనిత రామ్మోహన్ దంపతుల సమీప బంధువు శ్రీనివాస్ కూమార్తె స్నేహ వివాహం ఈ నెల 24న కామారెడ్డిలో జరిగింది. అయితే ఆ మరుసటి రోజే(డిసెంబరు 25) కౌన్సిలర్ మామయ్య లక్ష్మీరాజం మృతి చెందాడు. ఈ నేపథ్యంలో..  స్నేహ పెళ్లికి సంబంధిన బంగారంతో పాటు బంధువుల బంగారాన్ని కూడా వనితా రామ్మోహన్ ఇంట్లో ఉంచి, లక్ష్మీరాజం అంత్యక్రియలకై మాచారెడ్డి మండలం గజ్యాయనాయక్ తండాకు  వెళ్లారు.(చదవండి: భగ్గుమన్న ‘బిచ్కుంద’)

ఈ క్రమంలో మూడు రోజుల అనంతరం ఉదయం ఇంటికి చేరుకోగా.. తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కామారెడ్డి ఇంచార్జి డీఎస్పీ శశాంక్ రెడ్డి, కామారెడ్డి పట్టణ సీఐ మధుసూదన్,  ఎస్‌ఐ రవి కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇంటి ముందర బిగించిన సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ విషయం గురించి వనితా రామ్మోహన్‌ మాట్లాడుతూ.. తక్షణమే చర్యలు తీసుకుని దొంగల ఆచూకీ కనిపెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు