యువతిపై మేడ్చల్ ఏటీవో లైంగిక వేధింపులు!
తండ్రి పింఛను కోసం దరఖాస్తు చేసిన యువతి
మేడ్చల్ ట్రెజరీ ఆఫీస్లో ఘటన
మేడ్చల్: తండ్రి పింఛనును తనకు మంజూరు చేయాలని కోరుతూ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన ఓ యువతిని తనకున్న అధికారంతో లోబరచుకోవాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. సదరు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించగా తీవ్రంగా ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించాడు ఆ అధికారి. నాలుగు రోజుల క్రితం మేడ్చల్ ట్రెజరీ కార్యాలయం లో జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
బాధిత యువతి కథనం ప్రకారం..నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి తండ్రి ప్రభు త్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యి పింఛనును తీసుకుంటున్నారు. అయితే ఇటీవల అతడు మరణించడం, అంతకుముందే తల్లి కూడా చనిపోవడంతో యువతి అనాథగా మారింది. దీంతో తండ్రికి వచ్చే పింఛను తనకు మంజూరు చేయాలని కోరు తూ నాలుగు రోజుల క్రితం మేడ్చల్ ట్రెజరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. తనతో సినిమాకు వస్తేనే పింఛను మంజూరు చేస్తానంటూ అక్కడ అదనపు ట్రెజరీ అధికారి (ఏటీవో)గా పనిచేస్తున్న పవన్ కుమార్ ఆ యువతిని లైంగికంగా వేధించారు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో సదరు అధికారి అక్కడ్నుంచి మెల్లగా జారుకున్నాడు. విషయాన్ని అక్కడి అధికారులకు, టీఆర్ఎస్ నాయకులకు చెప్పగా ఏటీవోకు యువతికి మధ్య రాజీకి ప్రయత్నించారే తప్ప అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదు.
అంతా అబద్ధం: యువతి వివాహం కాలేదని చెబుతూ పింఛను పొందాలని చూసిందని, నిబంధనల ప్రకారం ఆమె దరఖాస్తును తిరస్కరించి రికవరీకి ఆదేశాలివ్వడంతోనే ఆ యువతి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఏటీవో పవన్ కుమార్ వివరణ ఇచ్చారు.