శ్రావణిని ఫోన్‌లో బెదిరించిన దేవరాజ్‌

9 Sep, 2020 19:14 IST|Sakshi

దేవరాజ్ విడుదల చేసిన ఆడియో అవాస్తవం: సాయి

సాక్షి, హైదరాబాద్‌: నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య వ్యవహారం టీవీ సీరియల్‌లాగానే పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా శ్రావణి స్నేహితుడు దేవరాజ్‌ రెడ్డి విడుదల చేసిన వీడియో అవాస్తవం అని సాయి అనే వ్యక్తి మరో వీడియో విడుదల చేశాడు. తాను శ్రావణి ఫ్యామిలీకి ఫ్రెండ్‌నని చెప్పాడు. ఆమె చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నానని.. తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేశాడు. (నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం )

కాగా  శ్రావణి ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెను తాను బెదిరించలేదంటూ దేవరాజ్‌ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే శ్రావణి - దేవరాజ్‌ ఫోన్ సంభాషణలు ‘సాక్షి టీవీ’కి చిక్కాయి. ఆ ఫోన్‌ సంభాషణలో శ్రావణిని దేవరాజ్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘మర్యాదగా వచ్చి గంట టైం గడపాలని, రాకపోతే తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేవని దేవరాజ్ బెదిరించగా, ‘ఇంతటితో ఆపేయ్.. నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు.. నీతో మాట్లాడను సారీ దేవ’ అంటూ శ్రావణి మాట్లాడింది. (తెలుగు సీరియల్‌ నటి ఆత్మహత్య)

మౌనరాగం, మనసు మమత వంటి ప్రేక్షకాదరణ పొందిన టీవీ సీరియళ్లలో నటించిన  శ్రావణి హైదరాబాద్‌ ఎస్సార్‌ నగర్‌లోని మధురానగర్‌లోని నివాసంలో నిన్న రాత్రి  ఉరి వేసుకుంది. ఇది గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దేవరాజ్‌ అనే యువకుడి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని శ్రావణి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు