బాలికపై లైంగిక దాడి ... ఆపై వ్యభిచార వృత్తిలోకి దింపి...

5 Jan, 2022 08:41 IST|Sakshi

Two women who lured A Girl Into Prostitution: ఓ బాలికకు మాయమాటలు చెప్పి వ్యభిచార వృత్తిలో దింపిన ఇద్దరు మహిళలను బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్‌ చేశారు. చార్మినార్‌ డివిజన్‌ ఏసీపీ భిక్షం రెడ్డి, బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్‌ దుర్గా ప్రసాద్‌ వివరాలు వెల్లడించారు... కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటోంది. నవంబర్‌ 20న సోదరితో గొడవ పడిన మైనర్‌ బాలిక అర్థరాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి రాజేంద్రనగర్‌లోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు చేరుకుంది.

ఫిష్‌ బిల్డింగ్‌ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను వెంబడించారు. దీంతో అదే ప్రాంతంలో ఉన్న ఆటో డ్రైవర్లు సమీర్, హఫీజ్‌ ఆమెను తమ ఆటోలో ఉప్పర్‌పల్లికి తీసుకెళ్లారు. బుస్రా సుల్తానా, ఆయేషా బేగం అనే మహిళలకు  బాలికకు పరిచయం చేసి, ఇక్కడే ఉంటుందని తెలిపారు. అనంతరం డిసెంబర్‌ 26న బాలికను మైలార్‌దేవ్‌పల్లిలోని అలీనగర్‌ హ్యాపీ హోమ్స్‌కు మార్చారు. అదే రోజు సమీర్,  హఫీజ్‌ బాలికకు మత్తు మందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు. ఇందుకు బుస్రా సుల్తానా, ఆయేషా బేగం వారికి సహకరించారు.

అనంతరం బాలికను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపి బయటి నుంచి విటులను రప్పించారు. వీరి చెర నుంచి బయట పడేందుకు ప్రయత్నించిన బాధితురాలు ఆయేషా బేగం సెల్‌ఫోన్‌ ద్వారా తన అత్త ఇన్‌స్ట్రాగామ్‌కు తాను ఉంటున్న లోకేషన్‌ షేర్‌ చేసింది. బాలిక మిస్సింగ్‌పై డిసెంబర్‌ 1న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు పంపించిన లోకేషన్‌ను డిసెంబర్‌ 31న బహదూర్‌పురా పోలీసులకు అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించారు. ఉప్పర్‌పల్లికి చెందిన బుస్రా సుల్తానా, ఆయేషా బేగంలను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు సమీర్, హఫీజ్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఏసీపీ తెలిపారు

మరిన్ని వార్తలు