కూరగాయలు కోయమన్న అత్త.. చేతకాక కత్తితో కోడలు దాడి

2 Sep, 2021 13:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సక్రమంగా కోయకపోవడంతో తిట్టిన అత్త

ఇద్దరి మధ్య వాగ్వాదం.. కోపోద్రిక్తురాలై కత్తితో దాడి

26 పోట్లతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అత్త మృతి

రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణ సంఘటన

జైపూర్‌: అత్తాకోడళ్ల మధ్య ఎప్పుడూ పొసగదు. భర్త, కుమారుడితో బాగానే ఉండే వీరు వారిద్దరూ ఎదురుపడ్డప్పుడు ఏం జరుగుతుందో ఏమో అగ్గిమీద గుగ్గిలమవుతారు. గుంటూరు జిల్లాలో చపాతీ కర్రతో అత్తపై దాడి చేసిన ఘటన మరువకముందే మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయలు కోయమని చెప్పడంతో ఆ కోడలు అత్తపై కత్తితో దాడి చేసింది. సరిగ్గా తరగకపోవడంతో దుర్భాషలాడడంతో కోడలు క్షణికావేశంలో అదే కత్తితో పొడిచింది. 26 పోట్లు పొడవడంతో అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దాడి చేసిన అనంతరం కోడలు తట్టాబుట్టా సర్దేసుకుని పరారైంది. ఈ దారుణ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. (చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్‌ ఏంటంటే!)

జైపూర్‌లోని భంక్రోటాకు చెందిన అత్తాకోడళ్లు మోహినీ దేవి (62) తన కుమారుడికి పద్నాలుగేళ్ల కిందట మమతాదేవీ (35)తో వివాహం జరిపించింది. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వంట కోసం కోడలు కూరగాయలు తరుగుతోంది. అయితే సక్రమంగా కోయడం లేదని అత్త మోహిని తిట్టింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక తట్టుకోలేని కోడలు క్షణికావేశంలో కూరగాయలు కోస్తున్న కత్తితోనే అత్తపై దాడికి పాల్పడింది. ఏకంగా 26 చోట్ల పొడవడంతో మోహినీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కోడలు తన సామగ్రి, పిల్లలను తీసుకుని పరారైపోయింది.

స్థానికుల సమాచారంతో ఇంటికి వచ్చిన కుమారుడు రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న తన తల్లిని ఎస్‌ఎంఎస్‌ ఆస్పత్రికి తరలించాడు. ఆమె చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూసింది. తన తల్లిని హతమార్చిన భార్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరారైన కోడలు మమతను పోలీసులు గాలించి ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. మమతకు ఇద్దరు అబ్బాయిలు, ఓ కుమార్తె ఉంది.

చదవండి: సినిమాను మించిన మర్డర్‌.. మూడు హత్యలతో వరంగల్‌ ఉలిక్కి

మరిన్ని వార్తలు