వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

30 Jan, 2021 08:57 IST|Sakshi

సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసింది. భార్య ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఈ ఘటన తేని జిల్లా దేవనాంపట్టిలో చోటుచేసుకుంది. కొంగువార్‌ పట్టికి చెందిన శివకుమార్‌ (43) రైతు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పాపాత్తికి ముగ్గురు కుమార్తెలు. 24వ తేదీ కల్లుపెట్టి, కామక్కాపట్టిలోని మైదాన ప్రాంతంలో శివకుమార్‌ తీవ్రగాయాలతో మృతి చెంది పడివున్నాడు. ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అతని మృతిపై అనుమానం ఉందని బంధువులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పాపాత్తిని అనుమానించిన పోలీసులు విచారణ జరిపారు.

పోలీసుల వద్ద పాపాత్తి ఇచ్చిన వాంగ్మూలంలో తనకు, తన భర్త శివకుమార్‌ వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న సెల్వరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడిందని, ఈ విషయం శివకుమార్‌కు తెలియడంతో అతను తనను మందలించినట్టు తెలిపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని శివకుమార్‌ను సెల్వరాజుతో కలిసి హత్య చేసేందుకు మరో ట్రాక్టర్‌ డ్రైవర్‌ అయ్యనార్‌ వద్ద సాయం కోరినట్టు పేర్కొంది. శివకుమార్‌కు మద్యం తాగించిన అయ్యనార్‌ అతన్ని బైకులో ఎక్కించుకుని వెళ్లి మైలేజీ రాయికి ఢీకొట్టించి తరువాత శివకుమార్‌ గొంతు కోసి హత్య చేశాడని పాపాత్తి పోలీసులకు విచారణలో తెలిపింది. 

మరిన్ని వార్తలు