ప్రియుడితో సన్నిహితంగా ఉంటూ.. భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి..

17 Jan, 2023 13:09 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, తాడేపల్లిరూరల్‌(మంగళగిరి): పండగ వేళ కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి భర్తను కర్కశంగా హతమార్చింది.  విచక్షణారహితంగా కొట్టి చంపింది. మంగళగిరి సీఐ అంకమరావు కథనం ప్రకారం మంగళగిరి పట్టణానికి చెందిన వింజమూరు క్రాంతికుమార్‌ (32) బంగారం పని చేస్తుంటాడు. ఏడేళ్ల క్రితం ఏలూరుకు చెందిన గంగాలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. క్రాంతికుమార్‌ శనివారం అర్ధరాత్రి వరకు షాపులో ఉండి అనంతరం ఇంటికి వచ్చాడు.

సమీప బంధువు అయిన ఏలూరుకు చెందిన మరిడయ్య అనే యువకుడితో కలిసి గంగాలక్ష్మి బెడ్‌రూంలో సన్నిహితంగా ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు. భార్యతో గొడవ పడ్డాడు. మరిడయ్యను నిలదీశాడు. దీంతో వారిద్దరూ ఘర్షణకు దిగారు. ఈ సమయంలో క్రాంతికుమార్‌ను గంగాలక్ష్మితోపాటు మరిడయ్య బయటకు తీసుకొచ్చి మరో వ్యక్తితో కలిసి విచక్షణా రహితంగా రాడ్లతో కొట్టారు. దీంతో క్రాంతికుమార్‌ బిగ్గరగా కేకలు వేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కేకలు విని చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి వచ్చేసరికి క్రాంతికుమార్‌ మృతి చెందాడు. 

గంగాలక్ష్మి, మరిడయ్యతో కలిసి అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించింది. ఇదే సమయంలో ఘటనాస్థలానికి వచ్చిన మంగళగిరి సీఐ అంకమరావు గంగాలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిడయ్య, మరో  వ్యక్తి పరారయ్యారు. క్రాంతికుమార్‌ సోదరుడు హరి కృష్ణ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లికాక ముందు నుంచే గంగాలక్ష్మి మరిడయ్య మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. గంగాలక్ష్మి భర్తతో కలిసి ఆదివారం ఉదయం పండగకు ఏలూరు పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, మరిడయ్య ఇక్కడకు రావడం, క్రాంతికుమార్‌ను చంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు పథకంలో భాగంగానే హత్య జరిగినట్టు క్రాంతి కుమార్‌ బంధువులు ఆరోపిస్తున్నారు. 

చదవండి: (షార్‌లో విషాదం.. సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఆత్మహత్య)

మరిన్ని వార్తలు