నపుంసకత్వాన్ని దాచి పెళ్లి చేశారు

9 Jun, 2021 14:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భర్త, అత్తింటి వారిపై బాధిత యువతి ఫిర్యాదు

తెనాలి రూరల్‌(గుంటూరు జిల్లా): ఎన్‌ఆర్‌ఐ సంబంధం అంటూ యువతిని వివాహం చేసుకున్నాడు. తొలి రేయిలోనే భర్త తాను నపుంసకుడినని చెప్పడంతో ఆ యువతి కంగు తింది. పైగా అదనపు కట్నం తెస్తే కాపురానికి తీసుకెళతానని భార్య, ఆమె తరఫు వారిని వేధింపులకు గురి చేయడమే  కాకుండా ఇటీవల దాడికి సైతం పాల్పడ్డాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తెనాలి సమీపంలోని పినపాడుకు చెందిన 20 ఏళ్ల యువతికి విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ప్రైవేటు కన్సల్టెన్సీలో పనిచేసే యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీన తెనాలిలో వివాహం జరిగింది. వరుడి తల్లిదండ్రులు పెళ్లి కొడుకు  త్వరలో చదువు కోసం కెనడా వెళతాడని, అక్కడే పార్ట్‌ టైం ఉద్యోగం  చేసుకుంటూ చదువుకుంటాడని, పెళ్లి చేసుకుని భార్యనూ తీసుకెళతాడని చెప్పారు.

వీసా, ఇతర పత్రాలన్నీ చూపించడంతో వధువు తల్లిదండ్రులు మంచి సంబంధం అని చెప్పి సుమారు రూ.10 లక్షల కట్నం, ఇతర లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి వివాహం చేశారు. వివాహం జరిగిన రోజు రాత్రే కార్యం నిమిత్తం వధువును విజయవాడ తీసుకువెళ్లారు. తొలిరాత్రి గదిలోకి వెళ్లిన ఆమెకు భర్త తాను నపుంసకుడినని, సంసారానికి పనికిరానని చెప్పడంతో కంగుతింది. బయట ఎవరికీ చెప్పవద్దని ప్రాధేయపడ్డాడు. మరుసటి రోజు విజయవాడలో వరుడి తల్లిదండ్రులు రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

రిసెప్షన్‌కు వచ్చిన తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు వధువు అసలు విషయం చెప్పుకుని భోరున విలపించింది. దీంతో వధువు తల్లిదండ్రులు తమ కుమార్తెను తెనాలిలోని పుట్టింటికి తీసుకొచ్చేశారు. అనంతరం ఇరుపక్షాల పెద్దలు పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఇటీవల విజయవాడలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా, రిసెప్షన్‌ కోసం తాము రూ.8 లక్షలు ఖర్చు పెట్టామని, వాటిని తిరిగి ఇవ్వాలని యువకుడు, అతని తరఫు వారు డిమాండ్‌ చేశారు. అంతకు కొద్ది రోజుల ముందు తెనాలి పినపాడుకు వచ్చిన వీరు, యువతి, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ మేరకు బాధిత యువతి తెనాలి త్రీ టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎం.విజయ్‌కుమార్‌ తెలిపారు.

చదవండి:
వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ...
బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి.. భర్త ఒక్కసారిగా షాక్‌

మరిన్ని వార్తలు