డిసెంబర్‌ 9న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

18 Nov, 2023 01:46 IST|Sakshi

కొవ్వూరు: కొవ్వూరు కోర్టు ప్రాంగణంలో డిసెంబరు 9న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా తొమ్మిదో అదనపు జడ్జి ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన కొవ్వూరులో విలేకర్లతో మాట్లాడారు. రాజీ పడదగిన అన్నీ రకాల కేసులను పరిష్కరించు కోవచ్చునన్నారు. సివిల్‌ ,క్రిమినల్‌ కేసులతో పాటు చెక్‌ బౌన్స్‌, వాహన ప్రమాదాలు, ప్రీ–లిటిగేషన్‌ ,బీఎస్‌ఎన్‌ఎల్‌ కేసులు రాజీ చేసుకోవచ్చునని సూచించారు.లోక్‌ అదాలత్‌ పరిష్కరించుకున్న కేసులపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. కోర్టు ఖర్చులు,సమయం ఆదా చేసుకోవచ్చునని సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు.

ఏసీబీ వలలో

సామర్లకోట ఆర్‌ఐ

రూ.8వేలు లంచం తీసుకుంటూ

పట్టుబడిన వైనం

కాకినాడ క్రైం: సామర్లకోట తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ)గా పనిచేస్తున్న దుర్గా బాలాజీ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ అదనపు ఎస్పీ సీహెచ్‌ సౌజన్య తెలిపిన వివరాల మేరకు సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన అవసరాల రామలక్ష్మి అనే మహిళ కొద్దిరోజుల క్రితం మండల రెవెన్యూ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్‌, బర్త్‌ సర్టిఫికెట్‌కోసం దరఖాస్తు చేసుకుంది. వాటిని మంజూరు చేసేందుకు రూ.10వేలు లంచం ఇవ్వాలంటూ ఆర్‌ఐ బాలాజీ డిమాండ్‌ చేశాడు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది.

వారి సూచనల మేరకు రామలక్ష్మి కాకినాడ రామారావుపేటలో నివాసం ఉంటున్న ఆర్‌ఐ బాలాజీని అదే ప్రాంతంలో అతని డయాగ్నస్టిక్‌ సెంటర్‌ (డీకే డైయాగ్నక్‌సెంటర్‌) లో శుక్రవారం రాత్రి కలిసింది. ఆర్‌ఐ ప్రైవేటు అసిస్టెంట్‌ చిన్న ద్వారా బేరసారాలు అనంతరం రూ. 8వేలు లంచంగా తీసుకున్నాడు. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని ఆర్‌ఐని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు వాసుకృష్ణ, బి శ్రీనివాస్‌, ఎస్‌ఐ నిల్సన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు