జిల్లా కలెక్టర్ మాధవీలత
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): ఓటుహక్కు లేనివారు నమోదుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ మాధవీలత కోరారు. రాజమహేంద్రవరంలోని వై జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన ఓటరు అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కియోస్కోను ప్రారంభించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మాధవీలత మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలన్నారు. బీఎల్ఓలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జాబితాలో పేరు నమోదు అయిందో లేదో సరి చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటు లేకపోతే ఫారం–6 ద్వారా నమోదు కావాలన్నారు. చిరునామా మారిన సందర్భంలో ఓటును కూడా మార్చుకోవాలన్నారు. ఇందుకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పారదర్శకతతో కూడిన ఓటరు జాబితా రూపొందించాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ముఖ్యమైన 8 కూడళ్లలో కియోస్కోలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పిలుపు నిచ్చారు. మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ ఓటు లేని వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీపీవో జేవి సత్యనారాయణ, అదనపు కమిషనర్ సత్య వేణి, జిల్లా అధికారులు, కాలేజీ, మునిసిపల్ స్కూల్ విద్యార్థులు, ఆర్ ఎం సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.