నూజివీడు: గొల్లపల్లిలోని శ్రీరఘునాథస్వామి ఆలయంలో రికార్డులను తగుబెట్టంది టీడీపీ నేతలేనని పోలీసుల విచారణలో తేలింది. ఈనెల 22వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ఈఓ కార్యాలయం తాళాలు పగులగొట్టి అందులోకి ప్రవేశించిన రికార్డులను దగ్ధం చేసిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఆలయ కార్యనిర్వాహక అధికారి విశ్వేశ్వరరావు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆలయంలోని సీసీ కెమేరాల ఫుటేజీని పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. దీనిలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ, మరొక కార్యకర్త, మరికొందరు కలిసి ఆలయ రికార్డులను దగ్థం చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఇటీవల వీరు పరారై అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొనగా, గ్రామంలో అనుమానితులను విచారిస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ, మరో కార్యకర్త ఇంతటి దుశ్చర్యకు పాల్పడటంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
● సీసీ ఫుటేజీల ఆధారంగా నిర్ధారించిన పోలీసులు
● పరారీలో టీడీపీ మాజీ ఎంపీటీసీ, మరికొందరు