తుమ్ము వస్తే.. ఆపుకుంటున్నారా!ఇక అంతే సంగతులు

15 Aug, 2023 12:49 IST|Sakshi

తుమ్ములు రావడం సర్వసాధారణం. కొంతమంది త్ముమ్మడానికి సిగ్గుపడి ఆపుకుంటుంటారు. మీటింగ్‌ సమయంలో లేదా ఏదైనా సీరియస్‌ కార్యక్రమంలో చాలామంది తుమ్ము వస్తున్నా ఏదోలా ఆపేస్తారు. ఇలా ఆపడం వల్ల ఒక్కొసారి ప్రాణాంతకం అవుతుంది. ముక్కు నరాలు చిట్లడం వంటివి జరగుతాయి కూడా. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే చేసి ఏకంగా గొంతునే కోల్పోయాడు. అసలు తమ్మును ఆపొచ్చా! ఆపితే ఇక అంతేనా!..దాని గురించే ఈ కథనం.

34 ఏళ్ల బ్రిటీష్‌ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తుమ్మేందుకు సిగ్గుపడి నాసికా రంధ్రాలను గట్టిగా అదిమి, నోటిని కూడా మూసేశాడు. దీంతో ఒక్కసారిగా ముక్కు లేదా నోటి నుంచి గాలి వెళ్లే మార్గం లేక గాలి బుడగల రూపంలో ఛాతిపై ఒత్తిడి చూపడంతో మెడ చుట్టు ఉన్న నరాలు పొంగి పగలిపోయే స్థితికి వచ్చేశాయి. ఆ తర్వాత గొంతులో రంధ్రం ఏర్పడి ఇక మింగే అవకాశం లేకుండా పోయింది. ఇక నెమ్మది నెమ్మదిగా స్వరాన్ని కూడా కోల్పోయాడు. 

గొంతులో రంధ్రం ఎలా ఏర్పడిందంటే..
గొంతులో ఉండే ఫారింక్స్‌ అంత సులభంగా చీలిపోదు. పదేపదే వాంతులు, దగ్గు లేదా బాహ్య గాయం కారణంగా మాత్రమే చీలీపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యక్తి విషయంలో గాలి బయటకు వెళ్లే మార్గం లేక గాలి బుడగలు అతని ఛాతీలోని కణజాలం, కండరాలలో స్థిరపడటం ప్రారంభించాయి. దీంతో మెడ అంతటా పాపింగ్‌, పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు వైద్యులు. ఇది తమకే చాలా షాకింగ్‌ అనిపించిందన్నారు. గొంతులోని పక్కటెముక నొప్పితో పాటు అతని గొంతు ప్రాంతంలో ఇన్ఫెక్షన్‌ కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం అతనికి ఫీడింగ్‌ ట్యూబ్‌ ఏర్పాటు చేశామని, దాని సాయంతో ఆహారం తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. యాంటీబయోటిక్స్‌ మందులతో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడని అన్నారు వైద్యులు. 

అసలు ఎందుకు తుమ్ము వస్తుందంటే..
ధూళి, పుప్పొడి, పోగ వంటి ఇతరత్ర కణాలు నాసికా రంధ్రంలోకి ప్రవేశించి చికాకు కలిగించడంతో తుమ్ము రావడం జరుగుతుంది. ముక్కులోని డెస్ట్‌ క్లియర్‌ చేసేందుకు శరీర ధర్మంగా వచ్చేదే ఈ తుమ్ము అని వైద్యులు చెబుతున్నారు. ఇది ముక్కుకి బాక్టీరియా, బగ్‌ల దాడి నుంచి రక్షణ ఇచ్చే ఒక సాధనం లాంటిది. మనం తుమ్మగానే కొద్దిపాటి తేమతో కూడిని గాలి బయటకు బలంగా వస్తుంది. దీని వల్ల గాల్లోకి సూక్ష్మ జీవులు ఈజీగా రిలీజ్‌ అవుతాయి. దీని కారణంగానే ఫ్లూ వంటి కొన్ని రకాల అంటువ్యాధులు ఈజీగా వ్యాప్తి చెందుతాయి. అందుకే కాస్త చేయి అడ్డుపెట్టుకుని తుమ్మండి అని చెబుతుంటారు.

అదేపనిగా వచ్చే తుమ్ములతో చాలా ఇబ్బంది ఉంటుంది. కొన్ని రకాల సీజన్లలో మరి ఎక్కువగా ఉంటుంది. గట్టిగా తుమ్మితే ఒక్కొసారి ముక్కు నుంచి రక్తం కారడం కూడా జరగుతుంది. చాలావరకు తుమ్ములు ఆందోళన కలిగించేవి కాకపోయిన తుమ్మును ఆపుకోకుండా ఉంటేనే మంచిదంటున్నారు వైద్యులు. తుమ్ము అనేది మానవ శరీర ధర్మం. గనుక పదిమందిలో తుమ్మేందుకు సిగ్గుపడి, లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవద్దు అని అంటున్నారు వైద్యులు. ఇది అందరికీ కామన్‌ కాబట్టి లేనిపోని రిస్క్‌లు కొని తెచ్చుకోకండి అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

(చదవండి: కడుపులో కణితి.. ఇలాంటివి ప్రాణాంతకమా? కాదా?)

మరిన్ని వార్తలు