మా అమ్మకు పెళ్లి... నాక్కూడా..

18 Dec, 2020 02:34 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో మొన్నటి ఆదివారం (డిసెంబర్‌ 13) ‘ముఖ్యమంత్రి సామూహిక్‌ వివాహ్‌’ కార్యక్రమం జరిగింది. 63 జంటలు ఈ సందర్భంగా వివాహం చేసుకున్నాయి. అయితే వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ జంటల్లో ఒక 27 ఏళ్ల కుమార్తె పెళ్లి చేసుకుంది. అలాగే ఆమె 53 ఏళ్ల తల్లి కూడా పెళ్లి చేసుకుంది. గతంలో ఏదో సినిమాలో తల్లి పెళ్లి కూతురు చేస్తుంది. అయితే ఇక్కడ కూతురు తాను చేసుకుంటూ తల్లికి కూడా చేసింది. అందుకే ఇది వైరల్‌ వార్త అయ్యింది.

గోరఖ్‌పూర్‌ పీప్రోలికి చెందిన బేలి దేవి భర్త పాతికేళ్ల క్రితమే మరణించాడు. ఆమె ఒక్కతే తన ఇద్దరు కొడుకులను, కుమార్తెలను పెంచి పెద్ద చేసింది. కొడుకుల పెళ్లిళ్లు అయ్యాయి. ఒక కూతురు పెళ్లి కూడా అయ్యింది. చివరి కూతురు ఇందు పెళ్లి సందర్భంగా తల్లి భవిష్యత్తు గురించి చర్చ జరిగింది. ‘పిల్లలందరూ నేను పెళ్లి చేసుకోవడమే మంచిదన్నారు’ అంది బేలి దేవి. భర్త తమ్ముడు జగదీశ్‌ అన్న కుటుంబాన్ని చూసుకోవడానికి అవివాహితుడిగా మిగిలిపోయాడు. అతడే ఇన్నాళ్లు ఆ కుటుంబానికి అండా దండా. ‘అతణ్ణే పెళ్లి చేసుకోవడం మంచిది’ అని నేనూ, పిల్లలూ భావించాం అంది బేలి దేవి. ఇంకేముంది ఒకే వేదికలో కూతురి పెళ్లి, తల్లి పెళ్లి జరిగిపోయాయి. 

మరిన్ని వార్తలు