కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలో పదేళ్లుగా జాతీయ రహదారి పనులు సాగుతూనే ఉన్నాయని, అధికార పార్టీ నాయకుల మధ్య పర్సంటేజీల పంచాయితీ వల్ల పనులు పూర్తికావడం లేదని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి, అడ్వకేట్ ఎర్రా కామేశ్ ఆరోపించారు. మన కొత్తగూడెం–మన కామేష్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ఎంజీ రోడ్డులో ప్రచారం నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపు యజమానులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ ముర్రేడుపై చేపట్టిన రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయే తప్ప పూర్తి కావడం లేదన్నారు. పాతతరం రాజకీయ నాయకుల మూసధోరణి వల్ల కొత్తగూడెం అభివృద్ధి కుంటుపడిందన్నారు. అభివృద్ధి కోసం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటేయాలని, కొత్తగూడెం నుంచి తనను గెలిపించాలని కోరారు. అనంతరం బంక్లో పెట్రోల్ కొడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంధం మల్లికార్జున్రావు, సాయి, మాలోత్ వీరునాయక్, నాగుల రవికుమార్, గుడివాడ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడులో వైరా అభ్యర్థి ప్రచారం
జూలూరుపాడు: బీఎస్పీ వైరా ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ రాంబాబు నాయక్ శుక్రవారం జడలచింత, కొత్తూరు, చిన్నహరిజనవాడ, పెద్దహరిజనవాడ, పాపకొల్లు, భీమ్లాతండా తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ నాయకులు తంబర్ల నరసింహారావు, నారపోగు ఉదయ్, దామెర్ల పృథ్వీ, దేవరకొండ నిర్మల, కొంగల లలిత, కంచపోగు నరసింహారావు, నునావత్ మోహాన్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రా కామేశ్