గుంటూరు రూరల్: క్రీడల్లో జయాపజయాలు సహజమని అపజయాలకు కుంగిపోకుండా క్రీడల్లో నైపుణ్యాలు మెరుగు పరుచుకునేందుకు ప్రతి క్రీడాకారిణి కృషిచేయాలని చేబ్రోలు హనుమయ్య ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.విధ్యాధర్ తెలిపారు. చౌడవరం గ్రామంలోని చిప్స్ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర కళాశాలల మహిళా కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలకు చెందిన క్రీడాకారిణిలు పోటీలలో తలపడ్డారు. పోటీలలో ఏఎన్యూ వ్యాయామ కళాశాల జట్టు ప్రథమ స్థానం సాధించగా, కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు ద్వితీయ స్థానం, తెనాలి జేఎంజే కళాశాల జట్టు తృతీయ స్థానం సాధించాయి. విజేతలకు ఏఎన్యూ ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ప్రమీలారాణి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. క్రీడల పరిశీలకులుగా డాక్టర్ అరుణ సుజాత పర్యవేక్షించారు. అనంతరం ఏఎన్యూ సౌత్జోన్ మహిళా కబడ్డీ జట్టును ఎంపిక చేశారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.శ్రీనివాస్, కార్యదర్శి డాక్టర్ సీఎన్ శ్రీనివాస్, కోశాధికారి ఆర్.గోపాకృష్ణ విజేతలను అభినందించారు.