పైపుల చోరీ కేసులో ముగ్గురు అరెస్టు | Sakshi
Sakshi News home page

పైపుల చోరీ కేసులో ముగ్గురు అరెస్టు

Published Wed, Nov 15 2023 12:54 AM

నిందితుల అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న తుళ్ళూరు సీఐ ఆనందరావు  - Sakshi

తాడికొండ: తుళ్ళూరు మండలంలో బీఎస్‌ఆర్‌ కంపెనీకి చెందిన ఇనుప వాటర్‌ పైపులు దొంగతనం చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు తుళ్ళూరు సీఐ ఆనందరావు తెలిపారు. మంగళవారం తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మంగళగిరికి చెందిన కృష్ణారావు అనే వ్యక్తి ఈ దొంగతనాలకు మూల కారకుడని, గత కొంత కాలంగా రాజధానిలోని ఇనుప వాటర్‌ పైపులను గ్యాస్‌ కట్టర్ల సాయంతో కత్తిరించి ముక్కలుగా చేసి స్క్రాప్‌ కింద అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. ఐనవోలు, దొండపాడు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలపై బీఎస్‌ఆర్‌ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు కృష్ణారావుతో పాటు దుగ్గిరాల మండలం చిలుమూరుకు చెందిన గ్యాస్‌ కట్టర్‌ ఫిరోజ్‌, స్క్రాప్‌ కొనుగోలు చేసిన రామిరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన వీళ్ళందరూ దొంగతనాలకు పాల్పడ్డారని, ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు పరారీలు ఉన్నందున వారిని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఎస్‌ఐ సోమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement