తాడేపల్లిరూరల్: మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణ రూపొందించారని మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి అన్నారు. సోమవారం తాడేపల్లి రూరల్పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయంలో మెప్మా మహిళలకు పట్టణ ప్రగతి యూనిట్లపై శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి మాట్లాడుతూ పట్టణ సమాఖ్యలు ఎంపిక చేసిన సంఘసభ్యులకు సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో భాగంగా నాలుగు రోజుల రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల నుంచి ప్రతి పట్టణం నుంచి స్వయంచాలక ఉపాధిని ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి కలిగిన ఒక సభ్యురాలిని పట్టణ సమాఖ్యకు ఒకరి చొప్పున ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో పట్టణ ప్రతి యూనిట్లు అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. నేటి నుంచి 23వ తేదీ వరకు జరుగనున్న ఈ శిక్షణా తరగతులకు రాష్ట్రం నుంచి స్వయం సహాయక సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని మహిళలకు కంప్యూటింగ్ పైన ఎంబ్రాయిడరీ, పేపర్ విస్తళ్లు, గుడ్డ సంచులు, వాటిపైన అచ్చు వేయడం, ఆర్టిఫిషియల్ నగల తయారీ, కర్పూరం, దీపం వత్తులు, సాంబ్రాణి, కారం, మసాలా పొడుల తయారీపైన ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మెప్మా ఎంసీ లలితశ్రీ,, ఎఓ రామాంజనేయులు, ఎస్ఎంసీ శ్రీనివాస్, కేఎల్యూ వైస్ చాన్స్లర్ డాక్టర్ జి.పార్థసారధి వర్మ, ప్రొ.వైస్ చాన్స్లర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగాధిపతి డాక్టర్ చప్పిడి హనుమంతరావు, డీన్ సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్, అసోసియేట్ డీన్ డాక్టర్ కె.రూతు రమ్య తదితరులు పాల్గొన్నారు.
మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి