అప్పుడు ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు ప్రాణం తీసుకున్నాడు

2 Oct, 2023 13:35 IST|Sakshi

హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్య, కుమారుడిని హత్య చేసిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని అనాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన ధన్‌రాజ్‌ (35) ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ధన్‌రాజ్‌ మార్చి 15న భార్య లావణ్య (28), కుమారుడు క్రియాన్స్‌(రెండు నెలలు)ను హత్య చేయడంతో పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రెండు నెలల క్రితం బెయిల్‌పై వచ్చిన నిందితుడు బంధువులు వద్ద ఆశ్రయం పొందాడు. వారం రోజుల క్రితం సొంత గ్రామం అనాజ్‌పూర్‌కు వచ్చి తండ్రితో పాటు నివాసం ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనాథగా మారిన కుమార్తె
తండ్రి చేతిలో తల్లి, తమ్ముడు ప్రాణాలు కోల్పోగా, తండ్రి ధన్‌రాజ్‌ ఆత్మహత్య చేసుకోవడంతో కుమార్తె ఆధ్య అనాథగా మారింది. ఆరు నెలలుగా బండరావిరాలలోని తన అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంటోంది. తండ్రి కూడా తనువు చాలించడంతో ఆధ్య ఇప్పుడు ఒంటరి అయ్యిందని స్థానికులు, బంధువులు కంటతడి పెట్టారు.

మరిన్ని వార్తలు