సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్, మాక్ పోలింగ్ త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల అధికారులను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. శుక్రవారం చాంద్రాయణగుట్ట, గోషామహల్, మలక్పేట, యాకుత్పుర నియోజకవర్గాలకు చెందిన డీఆర్సీలను సందర్శించి అక్కడ జరుగుతున్న కమిషనింగ్, మాక్ పోలింగ్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కమిషనింగ్, మాక్ పోలింగ్ నిర్వహించాలని అన్నారు. మాక్ పోలింగ్, కౌంటింగ్ జరిగే రోజు లెక్కింపు కౌంటర్ల ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు.