-

వెహికిల్‌ వేటలో ఆర్టీఏ

28 Nov, 2023 04:54 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు, నిఘా విభాగం విధి నిర్వహణ, పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది తరలింపు, బ్యాలెట్‌ బాక్సుల చేరవేత, తదితర విధుల కోసం గ్రేటర్‌లో పెద్ద ఎత్తున వాహనాల సేకరణకు ఆర్టీఏ అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులతో పాటు మినీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, క్యాబ్‌లు, ట్యాక్సీల కోసం ట్రావెల్స్‌ వేటలో పడ్డారు. మరోవైపు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడికక్కడ రోడ్లపైనే బలవంతంగా వాహనాలను జప్తు చేస్తున్నారని ట్రావెల్స్‌ నిర్వాహకులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 30న జరగనున్న ఎన్నికలతో పాటు డిసెంబర్‌ 3న ఫలితాలను వెల్లడించేవరకు గ్రేటర్‌లోని అన్ని నియోజకవర్గాల పరిధిలో సుమారు 1,500 వాహనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు సొంత వాహనా లు ఉన్న క్యాబ్‌ డ్రైవర్లు మొదలుకొని ట్రావెల్స్‌ సంస్థలకు చెందిన మినీ బస్సులు, 8 సీట్ల మ్యాక్సీ క్యాబ్‌లను, ఇన్నోవాలను ఎక్కువగా సేకరిస్తున్నారు.

ఉపాధికి ముప్పు..

● ‘ఎన్నికల విధుల కోసం వారం పాటు వాహనాలను అప్పగించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు సర్వీస్‌ చేస్తున్న వాహనాలను అధికారులకు ఇవ్వడం వల్ల ఆ సంస్థలతో ఒప్పందం దెబ్బతినే ప్రమాదముంది. ఉపాధిని కోల్పోవాల్సివస్తుంది’ అని ఒక ట్రావెల్స్‌ నిర్వాహకుడు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అధికారుల ఒత్తిడితో గత్యంతరం లేక తన క్యాబ్‌ను అప్పగించడం వల్ల ఒక కాల్‌సెంటర్‌ తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని మరో డ్రైవర్‌ విస్మయం వ్యక్తం చేశారు. ఎప్పుడు, ఎక్కడ తమ వాహనాన్ని జప్తు చేస్తారో తెలియని అనిశ్చితిలో ఉన్నట్లు పలువురు క్యాబ్‌డ్రైవర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఓలా, ఉబెర్‌ వంటి క్యాబ్‌ సంస్థలతో అనుసంధానమైన వాహనాలు నడుపుతున్న భాగస్వామ్య డ్రైవర్లకు సైతం ఇది ఇబ్బందికరంగానే ఉంది. ‘నాలుగైదు రోజుల ఎన్నికల విధుల కారణంగా తాము శాశ్వత ఉపాధిని కోల్పోవాల్సి వస్తుందని’ పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

● ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆర్టీఏ అధికారులు యుద్ధ ప్రాతిపదికన వాహనాల సేకరణ చేపట్టారు. నెల రోజుల ముందే వాహనాలను సేకరించగలిగితే బాగుండేది. ట్రావెల్స్‌ సంస్థలు, డ్రైవర్లు ముందస్తుగానే స్వచ్ఛందంగా వాహనాలను అప్పగించేందుకు అవకాశం ఉండేది. కానీ తీరా ఎన్నికల తేదీ ముంచుకొచ్చిన తరుణంలో గత నాలుగైదు రోజులుగా బలవంతంగా వాహనాల జఫ్తు చేస్తున్నారు. దీంతో అప్పటికే బుకింగ్‌లు చేసుకున్న వారు ఇబ్బందులకు గురికావలసి వస్తోంది. వివిధ ప్రైవేట్‌ సంస్థలకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న డ్రైవర్లు, వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

సకాలంలో చెల్లించాలి..

ఎన్నికల విధులకు వాహనాలను ఏర్పాటు చేయడం మా బాధ్యత. కానీ ఆ సమాచారం ముందుగా అందజేస్తే బుకింగ్‌లు రద్దు చేసుకోవడంతో పాటు ఆయా సంస్థలకు ప్రత్యామ్నాయ వాహనాలను సిద్ధం చేసుకొనేవాళ్లం.పైగా ఆర్టీఏ అధికారులు వాహనాలను బలవంతంగా తీసుకెళ్తారు.కానీ సకాలంలో డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు.ఈ సారైనా జాప్యం లేకుండా డబ్బులు చెల్లించాలి.

– షేక్‌ సలావుద్దీన్‌, అధ్యక్షుడు, తెలంగాణ

గ్రిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ అసోసియేషన్‌

ఎన్నికల కోసం భారీగా వాహనాల సేకరణ

ఆ విధులు వద్దంటున్న ట్రావెల్స్‌ నిర్వాహకులు

అద్దెలు అంతంత మాత్రమే

అవి కూడా చెల్లిస్తారో లేదోననే అనుమానం

మరిన్ని వార్తలు