హైదరాబాద్: ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు ఓటర్లను తరలించేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు రాపిడో సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని 2,600 పోలింగ్స్టేషన్లకు రాపిడో సేవలు లభించనున్నాయి. ఓటర్లు తమ మొబైల్ ఫోన్ రాపిడో యాప్లో ‘ఓట్ నౌ’ కోడ్ను నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకొనేలా ఈ సర్వీసులను అందుబాటులో ఉంచనున్నట్లు రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి తెలిపారు.
రవాణా సదుపాయం లేని కారణంగా ఓటు వేయలేని పరిస్థితి ఉండకూడదని చెప్పారు. గ్రేటర్లో గత ఎన్నికల్లో 40 శాతం నుంచి 55 శాతం వరకే ఓటింగ్ నమోదైందని, దీన్ని మరింత పెంచేందుకు తమవంతు కృషిగా రాపిడో సేవలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.