-
అబిడ్స్: సీతారాంబాగ్లోని శ్రీ రామమందిర్లో అక్టోబర్ 15వ తేదీన ప్రారంభమైన భారతభాగ్య సమృద్ధి యజ్ఞం సోమవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొని పూజలు చేశారు. సోమవారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆమె పాల్గొని వేద పండితుల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం యజ్ఞ నిర్వాహకులు మాధవీలత కొంపల్ల ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశ సంక్షేమం కోసం 45 రోజుల పాటు ఈ మహత్తర యజ్ఞం నిర్వహించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శివుడిని ప్రార్థించినట్లు తెలిపారు.