మట్టిలో ద్రాక్ష  తియ్యన

28 Jan, 2021 07:40 IST|Sakshi

ఫ్రూట్స్‌ ఏవైనా పండిన తరువాత ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. త్వరగా పాడైపోతాయి. ఈ విషయంలో  ద్రాక్షపండ్లకు(గ్రేప్స్‌) ఏమి మినహాయింపులేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రం  గ్రేప్స్‌ను నెలలపాటు నిల్వచేస్తూ..మార్కెట్లో మంచి ధర పలికినప్పుడు అమ్ముకుని లాభాలు పొందుతున్నారు అక్కడి వ్యాపారులు. ‘గంగినా’ అనే పురాతన సంప్రదాయ పద్దతిలో వీరు గ్రేప్స్‌ పాడవకుండా ఆరునెలలపాటు నిల్వచేస్తున్నారు. గంగినా అనేది ఫ్రూట్స్‌ నిల్వచేసే పురాతనమైన పద్దతి. ఈ పద్దతిలో ముందుగా తడిమట్టితో సాసర్‌ వంటి నిర్మాణం కలిగిన పాత్రలను తయారు చేసి ఎండలో ఆరబెడతారు. తరువాత నిల్వ చేయాలనుకున్న ద్రాక్షపళ్లను గ్రేడింగ్‌ చేస్తారు. గ్రేడింగ్‌లో మంచిగా ఉన్న వాటిని పాడైన,పుచ్చులు ఉన్న గ్రేప్స్‌ నుంచి వేరు చేస్తారు. ఇలా చేయకపోతే ఆల్రేడి పాడైన గ్రేప్స్‌ మంచి వాటిని కూడా పాడయ్యేలా చేస్తాయి.

నిల్వచేసే ద్రాక్షపండ్లలో ఒకటి పాడై ఉన్నా కంటైనర్‌లో ఉన్న మిగతా పండ్లు కూడా చెడిపోతాయి. అందువల్ల తప్పనిసరిగా గ్రేడింగ్‌ చేస్తారు. మంచిగా ఉన్న ద్రాక్షపండ్లను రెండు సాసర్ల మధ్యలో ఉంచి సాసర్‌ను తడిమట్టితో సీల్‌ చేస్తారు. ఆ తరువాత దానిని ఎండలో పెట్టి ఆరనిచ్చిన తరువాత...ఎండవేడి, గాలి తగలని చల్లని చీకటి ప్రదేశంలో వాటిని భద్రపరుస్తారు. ఒక్కో కంటైనర్‌లో ఒక కేజీ ద్రాక్షపండ్లను నిల్వచేయవచ్చు. ఆరు నెలలపాటు ఇవి తాజాగా ఉంటాయి. గంగినా పద్దతిలో నిల్వచేసిన పళ్లను మార్కెట్లో మంచి ధర పలికినప్పుడు అమ్మి మంచి లాభాలు పొందుతామని అక్కడి రైతులు చెబుతున్నారు. గంగినా పద్దతిలో నిల్వచేసిన గ్రేప్స్‌ చాలా తాజా ఉంటాయని, వీటికి మంచి రేటుకూడా వస్తుందని వారు అంటున్నారు. 

మరిన్ని వార్తలు