సూపర్‌ సూపర్‌ రిచ్‌ మేన్‌....జాక్‌ మా 

20 Oct, 2020 18:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవడంతోపాటు ఆ దేశాల ప్రజల ఆర్థిక పరిస్థితులు కూడా చిధ్రం అవడం మనకు తెల్సిందే. ఇందుకు భిన్నంగా అనతి కాలంలోనే చైనా తన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోగా, అక్కడి కొందరు కుభేరులు అనూహ్యంగా అద్భుతమైన లాభాలు సాధించగా, మరో 257 మంది చైనా వాణిజ్యవేత్తలు బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. 

చైనాలోనే అత్యంత సంపన్నుడిగా ఖ్యాతి గడించిన జాక్‌ మాకు చెందిన ‘అలీబాబా’ ఈ కామర్స్‌ సంస్థ ప్రపంచంలో ఎవరూ ఊహించలేనంత ఏడాదిలో సంపాదించి కొత్త చరిత్రను సృష్టించింది. ఏడాదిలో 1.5 ట్రిలియన్‌ డాలర్ల (కోటాను కోట్ల రూపాయలు, అక్షరాల్లో చెప్పాలంటే 12 పక్కన 13 సున్నాలు) లాభాలను గడించి అలీబాబా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆయన మొత్తం ఆస్తిలో 45 శాతాన్ని ఏడాది లాభాల ద్వారానే సమకూరినట్లు ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. అలీబాబా ఈ కామర్స్‌ వ్యాపారం పెరగడానికి లాక్‌డౌన్‌లు, ఆంక్షలు బాగా పనికొచ్చాయి. 

కరోనా వైరస్‌ సంక్షోభ కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన వారు కూడా కోట్లకు పడగలెత్తారు. వ్యాక్సిన్లను తయారు చేసే ఝిఫీ కంపెనీ వ్యవస్థాపకులు జియాంగ్‌ రెన్‌షెంగ్‌ ఆస్తులు కూడా ఏడాదిలో 19.9 బిలియన్‌ డాలర్లకు, అంటే మూడింతలు పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా చైనా జీడీపీ రేటు మైనస్‌లోకి పడిపోతుందనుకోగా, ఈ ఏడాది జీడీపీ 4.9 శాతం ఉన్నట్లు సోమవారం విడుదలైన ఆర్థిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్‌ లాంటి దేశాల జీడీపీ రేట్లు మైనస్‌లో పడిపోగా, చైనా ఒక్కటే ప్లస్‌ వైపు దూసుకుపోవడం అద్భుతమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనానే కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించిందన్న ఆరోపలు ప్రపంచవ్యాప్తంగా వినిపించాయి. అయితే అందుకు సాక్ష్యాధారాలు ఏ దేశమూ చూపలేక పోయింది. 

>
మరిన్ని వార్తలు