Anand Mahindra: 'సెక్యూరిటీ బుర్రకు పనిచెప్పి ఉంటే షింజో అబే ప్రాణాలతో బయటపడేవారు'

11 Jul, 2022 09:37 IST|Sakshi

టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది వైఫల్యం ఉందని పేర్కొన్నారు. సెక్యూరిటీ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉంటే షింజో బతికి ఉండేవారని చెప్పారు. 

అబేపై కాల్పులు జరిపినప్పుడు మొదటి తూటాకు, రెండో తూటాకు మధ్య కాస్త గ్యాప్ ఉందని మహీంద్రా వివరించారు. ఆ సమయంలో సెక్యూరిటీ షింజో అబేనూ కవర్ చేసి, ఆయనకు బుల్లెట్ తగలకుండా చూసుకుని ఉంటే ప్రాణాలతో బయటపడి ఉండేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా కాకుండా కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకునేందుకే భద్రతా సిబ్బంది ప్రయత్నించారని మహీంద్రా విమర్శించారు.

షింజో అబే ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా.. తెత్సుయా యమగామీ అనే వ్యక్తి ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. సొంతంగా తయారు చేసుకున్న గన్‌తో ఈ దారుణానికి పాల్పడ్డాడు. షింజోను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని క్షణాల్లోనే పట్టుకున్నారు భద్రతా సిబ్బంది.

అనంతరం ఓ మతసంస్థపై ద్వేషంతోనే తాను షింజోను హత్య చేసినట్లు యమగామీ తెలిపాడు. జపాన్ అధికారులు కూడా షింజో భద్రతలో వైఫల్యాలు ఉన్నాయని అంగీకరించారు.

చదవండి: మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య

మరిన్ని వార్తలు