తీవ్ర గాయాలపాలైన ఆర్మేనియన్‌ స్పీకర్‌

10 Nov, 2020 10:19 IST|Sakshi

యెరెవాన్‌: వివాదాస్పదమైన నాగోర్నో-కరాబాఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం కోసం గత కొద్ది రోజులుగా అజర్‌బైజాన్‌, ఆర్మేనియా మధ్య భీకర పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతన్న సైనిక ఘర్షణకు స్వస్తి పలికేందుకు గాను ఆర్మేనియా ప్రధాని నికోల్‌ పషిన్యన్‌ అజర్‌బైజాన్‌, రష్యాలతో శాంతి ఒప్పందాన్ని ప్రకటించాడు. దాంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆర్మేనియన్‌ పార్లమెంటుపై దాడి చేసి స్పీకర్‌ అరరత్‌ మిర్జోయన్‌ను గాయపర్చారు. రష్యన్‌ వార్తా సంస్థ ప్రకారం.. యెరెవాన్‌ నగరంలోని ఆర్మేనియన్‌ పార్లమెంట్‌ బయట మంగళవారం తెల్లవారుజామున నిర్వహించిన నిరసనలలో పాల్గొన్న ఆందోళనకారుల చేతిలో స్పీకర్‌ మిర్జోయన్‌ గాయపడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ప్రధాని నికోల్‌ పషిన్యన్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దాడిలో తీవ్రంగా గాయపడటంతో మిర్జోయన్‌‌కు ఆపరేషన్‌ జరిగినట్లు వెల్లడించారు. ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రధాని శాంతి ఒప్పందం ప్రకటించడంతో నిరసనకారులు యెరెవాన్‌ వీధుల్లో హింసాయుత చర్యలకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందటు ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇక పార్లమెంట్‌పై దాడి చేసిన నిరసనకారులందరికి శిక్ష పడుతుందని పషిన్యన్‌ మరో ప్రకటనలో తెలిపారు. (చదవండి: ప్రధాని సతీమణి సైన్యంలో శిక్షణ)

శాంతి ఒప్పందం దేని గురించి
నాగోర్నో-కరాబాఖ్‌ ప్రాంతంలో తలెత్తిన సైనిక ఘర్షణకు స్వస్తి పకలడానికి ఆర్మేనియా శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. దీన్ని కీలక పరిణామంగా పేర్కొన్నది. ఇక వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించడానికి శాంతి ఒప్పందానికి అంగీకరించానని నాగోర్నో-కరాబాఖ్ ప్రాంత నాయకుడు అరైక్ హరుతున్యన్ ఫేస్‌బుక్‌ లైవ్‌లో తెలిపారు. ఇక తాజా ఒప్పందం ప్రకారం.. అజర్‌బైజాన్ ఇటీవలి పోరాటంలో ఆక్రమించిన భూభాగం దాని అధీనంలోనే ఉంటుంది. ఇక వచ్చే నెలలో ఆర్మేనియా అదనపు భూభాగాన్ని ఆక్రమిస్తుందని తెలిపింది. అంతేకాక నాగోర్నో-కరాబాఖ్‌లను ఆర్మేనియాతో అనుసంధానించే రహదారికి కాపలాగా రష్యన్‌ భద్రతా దళాలను ఉంచారని ఆర్‌టీ.కామ్‌ నివేదించింది.(చదవండి: అజర్‌బైజాన్‌పై ఆర్మేనియా క్షిపణి దాడులు!)

సెప్టెంబర్ 27 న, నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై పట్టు కోసం ఆర్మేనియా, అజ్‌ర్‌బైజాన్‌ మధ్య తాజా వివాదం చెలరేగింది. నాగోర్నో-కరాబాఖ్ అజర్‌బైజాన్ పరిధిలోకి వస్తోంది. కాని దక్షిణ కాకసస్ పొరుగుదేశాల మధ్య తలెత్తిన యుద్ధం ముగిసినప్పటి నుంచి అంటే 1994 నుంచి ఈ ప్రాంతం ఆర్మేనియన్ దళాల నియంత్రణలో ఉంది. 

మరిన్ని వార్తలు