బిల్డింగ్‌ను ఢీకొని 1000 పక్షులు ఎందుకు మృతిచెందాయి?

8 Oct, 2023 12:38 IST|Sakshi

అమెరికాలోని చికాగోలో ఇటీవల ఒక్కరోజులో 1000 పక్షులు మృతి చెందడం సంచలనం కలిగించింది. ఆ పక్షులు శీతాకాలపు వలస కోసం దక్షిణ అమెరికా మైదానాలకు తరలివెళ్లాయి. అక్కడి నుండి ఉత్తర అమెరికాకు తిరిగి వస్తుండగా, చికాగోలోని మెక్‌కార్మిక్ ప్లేస్ సమీపంలో ఒకటిన్నర మైళ్ల వ్యాసార్థంలో పక్షులు చనిపోయి కుప్పలుగా పడిపోయాయి. స్థానికులు ఆ పక్షులకు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వాటి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పక్షులు ఇలా చనిపోవడానికి కారణం అవి భవనాన్ని ఢీకొని కింద పడిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా చికాగో బర్డ్ కొలిజన్ మానిటర్స్ డైరెక్టర్ అన్నెట్ ప్రిన్స్ మాట్లాడుతూ భవనం సమీపంలో పక్షులు నేలకొరిగాయని తెలిపారు. వీటిలో మృతిచెందిన, గాయపడిన పక్షులు ఉన్నాయి. దాదాపు 1.5 మిలియన్ పక్షులు ఇక్కడి నుంచి వలస వెళుతుంటాయి. వీటిలో టేనస్సీ వార్బ్లెర్స్, హెర్మిట్ థ్రష్‌లు, అమెరికన్ వుడ్‌కాక్స్, ఇతర రకాల సాంగ్‌బర్డ్‌లు ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియోలో కిటికీలకు తగిలి చనిపోయే పక్షులపై పరిశోధన చేసిన బ్రెండన్ శామ్యూల్స్.. కిటికీకి తగిలిన ప్రతి పక్షి చనిపోదని చెప్పారు. పక్షుల మరణాలకు గాలి, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణం కావచ్చన్నారు. 

అమెరికన్ బర్డ్ కన్జర్వెన్సీకి చెందిన బ్రియాన్ లెంజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక బిలియన్ పక్షులు గాజు కిటికీలను ఢీకొనడంతో చనిపోతున్నాయన్నారు. పక్షులు అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసినప్పుడు, భయపడి కిందపడి చనిపోతాయన్నారు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని పక్షులు గాయపడతాయన్నారు. భవనాల లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం పక్షుల మరణాలను తగ్గించడానికి ఒక మార్గంమని పేర్కొన్నారు చికాగోలో పక్షుల మరణాలపై 2021లో జరిపిన ఒక అధ్యయనంలో పెద్ద భవనాల్లో సగం లైట్లు ఆఫ్ చేయడం వల్ల పక్షుల ఢీకొనడం 6 నుంచి 11 రెట్లు తగ్గుతుందని తేలింది. 
ఇది కూడా చదవండి: బ్రిటన్ ధూమపాన రహితదేశం కానుందా?

మరిన్ని వార్తలు