Earth Quake in Indonesia: ఇండోనేషియా: శక్తివంతమైన భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్‌

29 Aug, 2023 11:41 IST|Sakshi

బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు అయ్యిందని  యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మటారమ్‌కు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని వెల్లడించింది.

ఇక భూ అంతర్భాగంలో 518 కిలోమీటర్లు దిగువన కదలికలు సంభవించాయని సిస్మోలాజికల్‌ సెంటర్‌ వెల్లడించింది. అయితే ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. మరోవైపు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే మాత్రం భూకంప తీవ్రత 7.1గా పేర్కొంది. ఇక.. సముద్ర గర్భంలో చాలా లోతులో కదలికలు సంభవించడంతో సునామీ (Tsunami) వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది.

ఇదిలా ఉంటే..  6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలసీ (NCS) పేర్కొంది. అలాగే.. మంగళవారం వేకువజామున 3.50 గంటలకు అండమాన్‌ సముద్రంలో (Andaman Sea) కూడా భూమి కంపించిందని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు