ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా భారత్‌.. నవంబర్‌ 15న మరో ఫీట్‌!

11 Nov, 2022 09:04 IST|Sakshi

న్యూయార్క్‌: ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా భారత దేశం ఆవిర్భవించబోతోంది. అదీ 2023లోనే!. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాదిలో చైనాను అధిగమించి.. ప్రపంచంలోనే మోస్ట్‌ పాపులేటెడ్‌ కంట్రీగా భారత్‌ నిలవబోతోందని ఐరాస తెలిపింది. అంతేకాదు.. 

ఈ నవంబర్‌ 15వ తేదీ నాటికి ప్రపంచ జనాభా.. ఎనిమిది బిలియన్లకు(800 వందల కోట్లకు) చేరుకోనుందని ప్రకటించింది.  జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన UN వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022లోనే ఈ వివరాలను పొందుపరిచారు. అయితే.. అంచనా వేసిన గడువు దగ్గర పడుతుండడంతో ఇప్పుడు ఆ వివరాలను బయటికి విడుదల చేశారు.

ఇక 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే ఉండొచ్చని అంచనా వేసింది ఈ సంస్థ. భారత్‌తో పాటు పాకిస్తాన్‌, పిలిప్పీన్స్‌, ఆఫ్రికా దేశాలైన ఈజిప్ట్‌, ఇథియోపియా, కాంగో, నైజీరియా, టాంజానియా.. ఈ లిస్ట్‌లో ఉన్నాయి.  మరో విశేషం ఏంటంటే.. 1950 తర్వాత తొలిసారిగా 2020లో ప్రపంచ జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా పడిపోయిందని ఈ ఏజెన్సీ పేర్కొంది. ప్రపంచ జనాభా 2030 నాటికి 8.5 బిలియన్లు, 2050 నాటికి 9.7 బిలియన్లు, 2080 నాటికి 10.4 బిలియన్లకు చేరుకోనుందని అంచనా వేసింది ఐరాస సంస్థ.

ఇదీ చదవండి: ఫార్చూన్‌ పింక్‌.. విలువ రూ.231 కోట్లు

మరిన్ని వార్తలు