అధికారం మళ్లీ కిషిడా కైవసం !

2 Nov, 2021 05:48 IST|Sakshi

జపాన్‌లో అధికార లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ కూటమికి విస్పష్ట మెజారిటీ

టోక్కో: జపాన్‌లో పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకుంది. 465 సీట్లున్న పార్లమెంట్‌ దిగువసభలో లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ, దాని కూటమి పార్టీ కొమియిటో కలిపి సంయుక్తంగా 293 పైగా సీట్లను సాధించాయని వార్తలొచ్చాయి. దిగువసభలో కనీస మెజారిటీ సాధించాలంటే 233 సీట్లు అవసరంకాగా ఈ కూటమి అంతకుమించిన సీట్లను కైవసం చేసుకోవడం విశేషం.

అయితే, అధికారికంగా ఇంకా తుది ఫలితాలు వెల్లడికాలేదు.  ఎన్నికలకు ముందునాటి మంత్రివర్గాన్నే ఇకపైనా కొనసాగిస్తానని కిషిడా చెప్పారు. కోవిడ్‌ కట్టడి, కీలకమైన ఆర్థిక సంస్కరణలే ప్రధానాంశాలుగా ఈసారి ఎన్నికలు జరిగాయి. యొషిమిడి సుగా తర్వాత  ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన కిషిడా 10 రోజుల్లోనే దిగువ సభను రద్దుచేశారు. అధికార పార్టీ నాయకత్వం కోసం నిర్వహించిన ‘అంతర్గత ఎన్నిక’ల్లో విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంటరీ ఎన్నికలకు వెళ్లారు. ఆదివారం ముగిసిన ఎన్నికల్లోనూ తమ కూటమిని విజయతీరాలకు చేర్చారు.

మరిన్ని వార్తలు