లండన్: బ్రిటన్లో ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారులు మరోసారి పేట్రేగిపోయారు. లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇటీవల బ్రిటన్లోని గ్లాస్గో పట్టణంలో గురుద్వారాలోకి భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి వెళ్లకుండా ఖలిస్తానీవాదులు అడ్డుకున్న ఘటనను మరవకముందే మళ్లీ అలాంటి నిరసన కార్యక్రమానికి బ్రిటన్ వేదికగా మారింది.
సోమవారం లండన్లో ఈ ఘటన జరిగింది. హై కమిషన్ కార్యాలయం ముందే ఆందోళన చేశారు. దీంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి వారిని నియంత్రించారు. మరోవైపు, దొరైస్వామిని అడ్డుకోవడాన్ని ఖండిస్తూ సదరు గురుద్వారా ప్రకటన విడుదల చేసింది.