హామీలు నెరవేర్చకపోతే.. అక్కడ నాయకుల పని అంతే! బంధించి నీటిలో..

10 Mar, 2023 15:40 IST|Sakshi

ప్రజలు చేత ప్రత్యక్ష్యంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారిగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఐతే ‍ప్రతి నాయకుడు తనని గెలిపిస్తే ఇవి చేస్తాం, అవి చేస్తాం అంటూ ఎన్నెన్నో హామీలు ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత గెలిచాక అసలు వాటిని గుర్తుంచుకునే తీరికే లేనట్లు ప్రవర్తిస్తారు. మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు ప్రజలు గానీ, వారికిచ్చిన హామీలు గానీ వారికి గుర్తేరావు, ఔనా! ఐతే ఇక్కడ ఆ ఊరిలో మాత్రం అలా కుదరదట.

నాయకులు హామీలు నెరవేర్చకపోతే ఇక అంతే సంగతులు. ‍ప్రజలే అక్కడ వారిని బహిరంగంగా  శిక్షిస్తారు. మళ్లీ ఇలాంటి పని చేయకుండా వారిలో మార్పు వచ్చేలా చేస్తారట. వివరాల్లోకెళ్తే..ఇటలీలో ఓ చిన్న పట్టణంలో ఈ వింత ఆచారం కొనసాగుతోంది. అక్కడ తాము ఎన్నుకున్న నాయకుడు తప్పుడుగా వ్యవహరించినా, తప్పుడు పనులు చేసినా ఇక అంతే సంగతులు. అలాగే ‍ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయినా.. వారిని బోనులో బంధించి నీటిలో ముంచేస్తారు.

అలా అని వారిని చనిపోయేంత వరకు నీటిలో ముంచేయరు. తాము చేసిన తప్పు వారికి అవగతమయ్యేలా జస్ట్‌ ఒక్క సెకను మాత్రమే అలా బోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది వారికి ఒక అవమానంలా అనిపించి ఎలాంటి తప్పులు దొర్లకుండా తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేయడమే తప్ప మరో ఉద్దేశ్యం ఏమి లేదని చెబుతున్నారు అక్కడి స్థానికులు. ఇది ఇటలీలోని టోంకాలో సాంప్రదాయకంగా జరుగుతుంది. ప్రతి ఏడాది జూన్‌ చివరిలో జరిగే విజిలియన్‌ వేడుకలో ఇది ఒక భాగం.  అంతేగాదు ఈ శిక్షలను జూన్‌ 26కు ముందు, చివరి ఆదివారం విధిస్తారు. గతేడాది 2022 జూన్‌ 19న దీనిని నిర్వహించారు. 2023, జూన్‌ 25 ఈ కార్యక్రమం ఉంటుంది.
(చదవండి: మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్‌ నిద్రిస్తుండటంతో..)

మరిన్ని వార్తలు