యుద్ధంలో పుతిన్‌కు ఎదురుదెబ్బలు.. జోష్‌లో ఉక్రెయిన్‌..

27 Mar, 2022 18:23 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం కొనసాగుతోంది. నెల రోజులుగా జరుగుతున్న దాడుల ఇరు దేశాల సైనికులు, రక్షణ శాఖకు చెందిన కీలక అధికారులు మృతి చెందారు. యుద్ధంలో ఉక్రెయిన్‌తో పోలిస్తే రష్యాకు చెందిన కమాండర్లు ఎక్కువ మంది చనిపోయినట్టు ఉక్రెయిన్‌ వార్తా సంస్థలు చెబుతున్నాయి. 

తాజాగా యుద్ధంలో రష్యా సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాంట్సేవ్ మరణించినట్లు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ వెల్లడించింది. అయితే, ఖెర్సాన్ సమీపంలోని చోర్నోబైవ్కా వైమానిక స్థావరం వద్ద చోటుచేసుకున్న దాడుల్లో జనరల్ రెజాంట్సేవ్ మరణించినట్లు ఉక్రెయిన్ శుక్రవారం వెల్లడించింది. కాగా, ఈ స్థావరాన్ని రష్యా కమాండ్ పోస్ట్‌గా ఉపయోగిస్తోంది.

మరోవైపు.. తాజాగా రష్యాకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ ఆండ్రీ మోర్డ్‌విచెవ్ కూడా ఈ స్థావరంపై ఉక్రెయిన్‌ సైన్యం జరిపిన దాడుల్లో మృతిచెందినట్టు నివేదికలు తెలుపుతున్నాయి. యుక్రేనియన్ చేసిన దాడిలో మరణించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు 1,351 మంది సైనికులు మరణించారని రష్యా చెబుతుండగా.. సంఖ్య ఎక్కువగా ఉందని ఉక్రెయిన్‌ మీడియా పేర్కొంటోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యాకు చెందిన ఏడుగురు అత్యున్నత స్థాయి అధికారులు మరణించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యా ఈ స్థాయిలో సైనిక జనరల్స్‌ను ఎప్పుడూ కోల్పోలేదు. చెచెన్యా యుద్ధంలోనూ, ఆఫ్ఘనిస్థాన్‌లో పోరులోనూ రష్యాకు ఇంత నష్టం జరగలేదని సమాచారం.

మృతి చెందిన రష్యా జనరల్స్ వీరే..
- ఒలేగ్ మిత్యేవ్: కమాండర్, 150వ రైఫిల్ డివిజన్,
- ఆండ్రీ కొలెస్నికోవ్: కమాండర్, 29వ కంబైన్డ్ ఆర్మీ,
- విటాలీ గెరాసిమోవ్: చీఫ్ ఆఫ్ స్టాఫ్, 41వ కంబైన్డ్ ఆర్మీ,
- ఆండ్రీ సుఖోవెట్‌స్కీ: డిప్యూటీ కమాండర్, 41వ కంబైన్డ్ ఆర్మీ,
- యాకోవ్ రెజాంట్సేవ్: కమాండర్, 49వ కంబైన్డ్ ఆర్మీ,
- ఆండ్రీ మోర్డ్‌విచెవ్: కమాండర్, 8వ కంబైన్డ్ ఆర్మీ.

మరిన్ని వార్తలు