శాంసంగ్‌కు ఎదురుదెబ్బ : షేర్లు ఢమాల్‌

18 Jan, 2021 13:09 IST|Sakshi

  అవినీతి,లంచం కేసులో శాంసంగ్‌ వైస్‌ ఛైర్మన్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్ష

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌కు సియోల్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి, లంచం కేసులో సంస్థ వైస్ చైర్మన్ జే వై లీ(52) కు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శాంసంగ్‌ మాజీ అధ్యక్షుడు పార్క్ జియున్-హే సహచరుడికి లంచం ఇచ్చారన్న ఆరోపణలను విచారించిన కోర్టు సోమవారం ఈ తీర్పును వెలువరించింది.

దాదాపు 7.8 మిలియన్ డాలర్ల విలువైన లంచం, అవినీతి , ఆదాయాన్ని దాచడం వంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టు విశ్వసించింది. అయితే దీనిపై ఏడు రోజులలోగా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు.మరోవైపు సుప్రీంకోర్టు ఇప్పటికే దీనిపై ఒకసారి తీర్పు ఇచ్చినందున, తీర్పును సమీక్షించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే లీ ఇప్పటికే అనుభవించిన శిక్షా కాలాన్ని పరగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు దీంతో శాంసంగ్‌ షేర్లు 4 శాతం వరకు పడిపోయాయి. అలాగే శాంసంగ్‌ సీ అండ్‌ టీ, శాంసంగ్‌ లైఫ్ ఇన్సూరెన్స్, శాంసంగ్‌ ఎస్‌డీఐ లాంటి వంటి అనుబంధ సంస్థల షేర్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.

కాగా ఈ కేసులో 2017లో దోషిగా తేలడంతో లీకు ఐదేళ్ల జైలు శిక్షవిధించింది సియోల్ హైకోర్టు అయితే తానెలాంటి నేరానికి పాల్పడలేదని ఈ ఆరోపణలను ఖండించిన లీ శిక్షను తగ్గించాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షను ఒక ఏడాదికి తగ్గించడంతో ఫిబ్రవరి 2018 లో విడుదలయ్యాడు. ఆ తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసి, 2019 లో తిరిగి విచారణకు ఆదేశిస్తూన సియోల్ హైకోర్టుకు తిరిగి పంపింది. దీంతో  తాజా తీర్పు వెలువడింది. కోవిడ్ -19 మహమ్మారి అమెరికా చైనాల సంబంధాలమధ్య అనిశ్చితి నేపథ్యంలో ప్రత్యేక వ్యూహాలతో వ్యాపారంలో దూసుకొస్తున్న   ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్స్, స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజానికి భారీ షాక్‌తప్పదని అంచనా.  లీ లేకపోతే  భారీ పెట్టుబడులు నిలిచిపోవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు