చెత్త యవ్వారం: కంటెయినర్ల నిండా టన్నుల్లో! యూకేకు షాకిచ్చిన లంక

21 Feb, 2022 19:08 IST|Sakshi

Sri Lanka Returns Tonnes Of Garbage: అక్రమంగా దిగుమతి అవుతున్న వేలాది టన్నుల వ్యర్థాలతో నిండిన అనేక వందల కంటైనర్లను శ్రీలంక సోమవారం బ్రిటన్‌కు పంపించిందని అధికారులు తెలిపారు. అవన్నీ బ్రిటన్‌ నుంచి వచ్చిన వ్యర్థాలు. 2017, 2019 మధ్య కాలంలో శ్రీలంకకు పెద్ద ఎత్తున చేరాయి. వాటిలో ఉపయోగించిన పరుపులు, తివాచీలు, రగ్గులు, మార్చురీల నుండి శరీర భాగాలతో సహా ఆసుపత్రుల నుండి బయోవేస్ట్ కూడా ఉందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అంతేకాదు ఆ కంటైనర్ల నుంచి ఘోరమైన దుర్వాసన వస్తుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం కొలంబో ఓడరేవులోని ఓడల్లో లోడ్ చేయబడిన కంటైనర్లలోదాదాపు 3 వేల టన్నుల వ్యర్థాలు ఉన్నాయి.

దీంతో కస్టమ్స్ చీఫ్ విజిత రవిప్రియ ఈ విషయమై స్పందించి.. "ఇలాంటి ప్రమాదకర వాటిని దిగుమతి చేసుకోం అప్రమత్తంగా ఉండటమే కాక మళ్లీ జరగకుండా చూసుకుంటాం." అని వివరణ ఇచ్చారు. అయితే కస్టమ్స్‌ ఒక స్థానిక సంస్థ బ్రిటన్ నుంచి వ్యర్థాలను దిగుమతి చేసుకుంటోందని చెబుతోంది కానీ కచ్చితమైన ఆధారాలను చూపించడంలో విఫలమైంది. ఈ క్రమంలో స్థానిక పర్యావరణ కార్యకర్త బృందం వ్యర్థాలను పంపినవారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే శ్రీలంక అప్పీల్ కోర్టు 2020లో ఆ పిటిషన్‌ను సమర్థించింది కూడా. ఈ నేపథ్యంలోనే శ్రీలంక ఆ వ్యర్థాలను యూకేకి తిరిగి పంపించేసింది.


ధనిక దేశాలు చాలావరకు ఇలా చెత్తను దిగుమతి చేసి.. సముద్ర మార్గాల గుండా పంపించి చేతులు దులుపుకుంటాయి. ఈ క్రమంలో ఆసియా దేశాల్లో చాలావరకు ఇలాంటి చెత్త కంటెయినర్‌లు చేరి.. ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతాయి. శ్రీలంకలాగే.. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా కూడా దిగుమతవుతున్న వందలాది చెత్త కంటైనర్‌లను గతంలో ఆయా దేశాలకు తిరిగి పంపించాయి.

(చదవండి: చంద్రుడిని ఢీ కొట్టనున్న రాకెట్‌!.మాది కాదంటున్న చైనా)

మరిన్ని వార్తలు