King Charles III Coronation: పట్టాభిషేకం వేడుకకు గుర్తుగా..రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు

6 May, 2023 10:35 IST|Sakshi

లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో శనివారం కింగ్‌ చార్లెస్‌ 3కి పట్టాభిషేకం అట్టహాసంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక వేడుకలో బ్రిటన్‌ రాజు దాదాపు రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆ బహుమతులను పట్టాభిషేక పతకాల రూపంలో అందించనున్నారు. వీటిని యూకే ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ పట్టాభిషేకంలో సహకరించి, విజయవంతంగా పూర్తి అయ్యేలా మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి ఇవ్వనున్నట్లు బ్రిటన్‌ పేర్కొంది.

తమ దేశంలో అత్యవసర సమయంలో సేవలందించే.. ఆర్మీ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తదితర శాఖలకు సంబంధించిన సిబ్బందికి అందజేయనున్నట్లు భారత మూలాలు ఉన్న యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్‌ అన్నారు. తమ కొత్త రాజు పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా..తమ దేశంలోని అత్యవసర సేవలందించే సిబ్బంది పాత్రను గుర్తించడమే గాక ఆ వేడుకకు గుర్తుగా ఈ కృతజ్ఞతా పతకాలను అందజేస్తున్నట్లు బ్రేవర్‌మాన్‌ అన్నారు. ఈ మేరకు బ్రేవర్‌మాన్‌ మాట్లాడుతూ..సాయుధ దళాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం, నిస్వార్థ సేవ లేకుండా ఈ పట్టాభిషేకం విజయవంతం కాదని అన్నారు.

ఈ పతకం వారి సేవకు, కృషికి గుర్తింపుగా దేశం తరుఫున కృతజ్ఞతా బహుమతి అని అన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగికి అందజేస్తారని చెప్పారు. ఈ పతకం ముందు భాగంలో రాజు, రాణి డబుల్‌ పోర్ట్రెయిట్‌ ఉంటుంది. దీన్ని మార్టిన్‌ జెన్నింగ్స్‌ రూపొందించారు. ఈ పతకాలను బర్మింగ్‌హామ్‌లోని వోర్సెస్టర్‌షైర్‌ మెడల్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ తయారు చేసింది.

ఈ పతకం మా సాయుధ దళాలు, చక్రవర్తి మధ్య ఉ‍న్న ప్రత్యేకమైన బంధానికి అద్దంపడుతుందన్నారు బ్రిటన్‌ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్. పట్టాభిషేకమహోత్సవ పతకాల సంప్రదాయం 1603 లో కింగ్‌జేమ్స్‌ హయాం నాటిదని చెప్పారు. ఈ వేడుకలో మొత్తం 4 లక్షల మందికి ఈ పట్టాభిషేక పతకాలు అందుకుంటారని బెన్ వాలెస్ చెప్పారు. ఈ మహోత్సవానికి ప్రపంచ దేశాల నుంచి అతిరథమహారథులకే గాక నిస్వార్థపూరితంగా పనిచేసి ఆయా విభాగాల్లో పేరుగాంచిన ప్రముఖులకు సైతం బ్రిటన్‌ ఆహ్వానం పలికింది.

(చదవండి:  యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ)

మరిన్ని వార్తలు