ముమ్మాటికీ అక్రమమే.. రష్యాకు భారీ షాక్‌.. మారని భారత్ తీరు

13 Oct, 2022 08:29 IST|Sakshi

న్యూయార్క్‌: ఐక్య వేదిక నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ముక్తకంఠంతో  ఖండించాయి ప్రపంచ దేశాలు. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రష్యా వ్యతిరేక తీర్మానానికి ఏకపక్షంగా ఓటేశాయి ప్రపంచ దేశాలు. ఉక్రెయిన్‌ భూభాగంలోని నాలుగు ప్రాంతాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండించే ముసాయిదా తీర్మానంపై భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగాక సాధారణ అసెంబ్లీలో ఓటింగ్‌ జరిగింది. 

ఆల్బేనియా తీసుకొచ్చిన ఈ ముసాయిదా తీర్మానంపై.. UNGA(ఐరాస సాధారణ అసెంబ్లీ) అత్యవసర ప్రత్యేక సమావేశంలో రికార్డెడ్‌ ఓటింగ్‌ జరిగింది. మొత్తం 193 సభ్యులున్న సాధారణ అసెంబ్లీలో.. రష్యా వ్యతిరేక తీర్మానానికి 143 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. రష్యాతో పాటు ఉత్తర కొరియా, బెలారస్‌, సిరియా, కరేబియన్‌ దేశం నికరాగ్వాలు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యాయి. మరో 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని లుగన్‌స్క్‌, డోనెట్‌స్క్‌, ఖేర్‌సన్‌, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా తనలో అధికారికంగా విలీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా తీరును ఖండించగా.. భద్రతా మండలిలో అమెరికా-ఆల్బేనియా తీసుకొచ్చిన తీర్మానాన్ని వీటో పవర్‌తో వీగిపోయేలా చేసింది రష్యా. అయితే ఇప్పుడు సర్వసభ్య దేశ వేదికైన ఐరాస అసెంబ్లీలో మాత్రం వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో యుద్ధం ఆపేయాలంటూ ప్రపంచ దేశాలకు రష్యాకు బలంగా పిలుపు ఇచ్చినట్లయ్యింది.

మారని భారత్‌ తీరు
ఇక ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ వైఖరి మారడం లేదు. తటస్థ తీరునే అవలంభిస్తూ వస్తోంది. తాజాగా సాధారణ అసెంబ్లీలో రష్యా వ్యతిరేక తీర్మానంపై కూడా అదే వైఖరి అవలంభించింది. ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. అయితే.. అంతకు ముందు ఈ తీర్మానం ఓటింగ్‌ ఎలా జరగాలనే అంశంపై మాత్రం రష్యాకు భారత్‌ షాక్‌ ఇచ్చింది. రికార్డెడ్‌ ఓటింగ్ జరగాలని ఆల్బేనియా‌-రహస్య బాలెట్‌ కోసం రష్యా పట్టుబట్టగా..  జరిగిన ఓటింగ్‌లో భారత్‌ రష్యాకు వ్యతిరేకంగా ఓటేసి.. ఆశ్చర్యపరిచింది.

ఇదీ చదవండి: యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా.. అండగా ఉంటాం!

మరిన్ని వార్తలు