జపాన్‌ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం

29 Nov, 2023 13:39 IST|Sakshi

అమెరికా సైనిక విమానం కుప్పకూలిపోయింది. జపాన్‌ సమీపంలోని యకుషిమా ద్వీప సమీపంలోని సముద్రంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఎనిమిదిమంది సభ్యులు ప్రయాణిస్తున్నారు. ఈ విషయాన్ని జపాన్‌ తీరప్రాంత అధికారి వెల్లడించారు. అయితే విమానంలోని వారి పరిస్థితి, భద్రతపై  సమాచారం తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.

యూఎస్‌కు చెందిన మిలిటరీకి చెందిన వి-22 ఓస్ప్రే విమానం ఎనిమిది మధ్య వ్యక్తులతో వెళ్తుంది. జపాన్‌లోని యకుషిమా ద్వీపం సమీపంలో సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జపాన్‌ సమయం ప్రకారం( భారత కాలమాన ప్రకారం ఉదయం 11:17 గంటలు) బుధవారం మధ్యాహ్నం 2.47 గంటలకు జరిగింది. యుఎస్ మిలిటరీ విమానం సముద్రంలో పడిపోవడంతో దాని ఇంజిన్ నుంచి మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని జపాన్‌లోని యూఎస్‌ బలగాల ప్రతినిధి పేర్కొన్నారు.

కాగా అమెరికాకు చెందిన ఎస్ప్రే సంస్థ విస్తరణ జపాన్‌లో వివాదాస్పందగా మారింది. ఈ  హైబ్రిడ్ విమానం ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ విమర్శలను అమెరికా సైన్యం, జపాన్ కొట్టిపారేస్తున్నాయి. ఇది పూర్తి సురక్షితమని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా గత ఆగస్టులో ఇదే యూఎస్‌ ఎస్ప్రే విమానం ఉత్తర ఆస్ట్రేలియా తీరంలో  కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు యూఎస్‌ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.  2016 డిసెంబర్‌లో కూడా జపాన్ దక్షిణ ద్వీపం ఒకినావా సముద్రంలో మరో విమానం ప్రమాదానికి గురైంది. 

మరిన్ని వార్తలు