Miss Universe 2022: మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని దక్కించుకున్న అమెరికా సుందరి

15 Jan, 2023 20:14 IST|Sakshi

మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని ఈసారి అగ్రరాజ్యం సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ఆర్‌బోనీ గాబ్రియల్‌ మిస్‌ యూనివర్స్‌ 2022 విజేతగా నిలిచింది. విన్నర్‌ గాబ్రియల్‌కు  భారత్‌కు చెందిన మాజీ విశ్వ సుందరి హర్నాజ్‌ సంధు ఈ కిరీటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా గడిచిన పదేళ్లలో యూఎస్‌ఏకు ఇది తొలి విజయం. ఇప్పటి వరకు తొమ్మిది విశ్వసుందరి టైటిళ్లను దక్కించుకోగా.. పోటీ చరిత్రలో అత్యధిక సార్లు గెలిచిన దేశంగా యూఎస్‌ఏ రికార్డు సృష్టించింది.

ఇక మిస్‌ వెనిజులా ఆమంద డుడామెల్‌ తొలి రన్నరప్‌గా నిలవగా.. మిస్‌ డొమిన్‌కన్‌ రిపబ్లిక్‌ ఆండ్రీనా మార్టినెజ్‌ రెండో రన్నరప్‌గా నిలిచింది. భారత్‌ తరపున ప్రాతినిథ్యం వహించిన మిస్‌ ఇండియా దివిట రాయ్‌ టాప్‌ 5లో సైతం చోటు దక్కించుకోలేకపోయింది. కేవలం టాప్ 16లో చోటు దక్కించుకొని సరిపెట్టుకుంది. అమెరికా లూసియానాలో వైభవంగా జరిగిన ఈ పోటీలో దాదాపు 80కుపైగా చెందిన అందాల భామలు పోటీ పడ్డారు.


మరోవైపు 2021 మిస్‌ యూనివర్స్‌ హర్నాజ్‌ సంధు చివరి సారిగా  వేదికపై ర్యాంప్‌ వాక్‌ చేశారు. హర్నాజ్‌ ర్యాంప్‌ మీదకు వస్తుండగా పోటీదారులందరూ చప్పట్లతో  ఉత్సహంగా ఆమెకు గ్రాండ్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. వేదికపై నడుస్తూ కంటి నుండి వస్తున్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించారు.  అనంతరం తన చేతుల మీదుగా కొత్త మిస్‌ యూనివర్స్‌కు కిరిటాన్ని అందించారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతేగాక విశ్వ సుందరి స్టేజ్‌పై హర్నాజ్‌ రెండు డిఫరెంట్‌ గౌన్లతో మెరిసిపోయారు. కాగా ఆమె ధరించిన స్పెషల్‌ గౌనుపై 1994 లో మిస్‌ యూనివర్స్‌గా గెలిచిన సుష్మితా సేన్‌  ఫోటో ఉండటం విశేషం.. కాగా హర్నాజ్‌ సంధు దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ను అందించిన విషయం తెలిసందే. తన కంటే ముందు 1994లో సుష్మితా సేన్‌.. 2000 సంవత్సరంలో లారా దత్తా ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు