Viral Video: మోడల్స్‌ను జంతువులుగా చూపించారు.. తీవ్ర విమర్శలు రావడంతో..

16 Dec, 2021 21:07 IST|Sakshi

ఏ సంస్థ అయిన తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు మార్కెటింగ్‌ తప్పనిసరి. మార్కెటింగ్‌, ప్రయోషన్స్‌ ద్వారా తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. వీటిలో యాడ్స్‌ కీలకమైనవి. యాడ్స్‌ ద్వారా విషయం ఎక్కువ మంది ప్రజలకు చేరుతుంది. అయితే ఈ యాడ్స్‌ కొన్నిసార్లు చిక్కుల్లో పడేస్తాయి. యాడ్స్‌లోని కంటెంట్‌ కొందరి మనోభావాలు దెబ్బతీసుంది. తాజాగా సౌత్‌ కొరియాకు చెందిన అతి పెద్ద డెయిరీ కంపెనీ సియోల్‌ మిల్స్‌ ఇలాగే వివాదంలో చిక్కుకుంది. 

సియోల్ మిల్క్ త‌న డెయిరీ ఉత్ప‌త్తుల ప్ర‌మోష‌న్ కోసం ఇటీవ‌ల ఓ వీడియో యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్‌లో మహిళలను ఆవులుగా చూపించడంతో కంపెనీపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఇందులో ఓవ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో ఫోటోలు తీస్తూ తిరుగుతూ ఉండగా అతనికి పొలంలో ఉన్న మహిళలు కనిపిస్తారు. వీరంతా అడవిలో జ‌ల‌పాతాల వ‌ద్ద నీళ్లు తాగి.. ప‌క్కనే గడ్డి మీద మీద యోగా చేస్తుంటారు. వీళ్లను గమనించిన ఆ వ్యక్తి  ఫోటో తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇంతలోనే అతని చెప్పు కింద ఉన్న ఓ క‌ట్టె పుల్ల విరిగి శ‌బ్దం వ‌స్తుంది.
చదవండి: మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న..

వెంటనే ఆ ఫోటోగ్రాఫ‌ర్ ఇలా కిందికి చూసి పైకి చూసే స‌రికి అక్కడ మ‌హిళ‌లు క‌నిపించ‌రు. ఆ శ‌బ్దం విన్న ఒక్కసారిగా మహిళ‌లు ఆవులుగా మారిపోతారు. దీంతో అత‌డు ఆశ్యర్యానికి గురవుతాడు. సియోల్‌ మిల్క్‌ డెయిరీ ఉద్దేశం.. ప్రకృతి ఒడిలో తిరిగే తమ కంపెనీ ఆవులు స్వచ్చమైన నీరు తాగి.. లేత పచ్చిక బయళ్లు తిని స్వచ్ఛమైన పాలనిస్తాయని చెప్పడం. ఆ క్రమంలో అందమైన మహిళా మోడల్స్‌ను ఉపయోగించుకోవడం విమర్శలకు దారితీసింది. ఈ యాడ్‌ను సియోల్ మిల్క్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో నవంబర్‌ 29న షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైర‌ల్ అయ్యింది. అయితే ఈ యాడ్‌పై కొరియా దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
చదవండి: విక్టరీ హగ్‌; ఆ ఎమోషన్‌కు అందరూ కనెక్ట్‌ అవుతున్నారు!

మోడల్స్‌ను ఆవులుగా చూపించ‌డం ఏంటంటూ కొంద‌రు మండిపడుతున్నారు. అలాగే మ‌హిళ‌ల‌ను అలా సీక్రెట్‌గా వీడియో, ఫోటోలు తీయ‌డం కూడా చట్ట్ట విరుద్ధమంటూ, మనుషులను పశువులుగా చూపించకూడదని మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీంతో డిసెంబర్‌ 8న ఈ యాడ్‌లను సోషల్‌ మీడియా నుంచి తొలగించింది. అంతేగాక యాడ్‌ కారణంగా మనోభావాలు కించపరిస్తే క్షమించాలని కోరింది. యాడ్‌ రూపకల్పనలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటామని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామమని పేర్కొంది.

మరిన్ని వార్తలు