● బీజేపీ నూతన సారథి విజయేంద్ర
శివాజీనగర: రాష్ట్రంలో పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రాధాన్యతనిస్తానని బీజేపీ నూతన రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర తెలిపారు. కొత్త పదవికి ఎంపికయ్యాక ఆయన శనివారం ఉదయం బెంగళూరులో పార్టీ నేత ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 58,282 బూత్లు ఉన్నాయి. అన్ని బూత్ల కమిటీలను బలోపేతం చేయడానికి శ్రమిస్తానని అన్నారు. రాష్ట్రంలో 2024 లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీ సీట్లను కాపాడుకోవడమే తమ ముందున్న పెద్ద సవాల్ అని విజయేంద్ర అన్నారు. పదవిని ఇచ్చినందుకు హైకమాండ్కు కృతజ్ఞతలన్నారు. పార్టీలో అసంతృప్త నేతలతో మాట్లాడి సర్దుబాటు చేస్తానన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
15 లేదా 16న బాధ్యతలు
విజయేంద్ర ఈ నెల 15 లేదా 16న బాధ్యతలను స్వీకరించే అవకాశముంది. ఆ తరువాత సమావేశం జరిపి బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశముంది. అధ్యక్ష పదవిని లింగాయత్కు ఇవ్వడంతో బీజేఎల్పీ నేత మరో బలమైన వర్గం నేతకు అప్పగించవచ్చని తెలుస్తోంది.
కంచెలో చిక్కిన చిరుత
మైసూరు: జంతువుల నుంచి పొలానికి రక్షణ కోసం వేసిన కంచెలో ఒక చిరుతపులి చిక్కుకుంది. మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోటె తాలూకా మళార గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి ఒక రైతు పొలం చుట్టూ ముళ్ల తీగతో కంచె వేశాడు. శుక్రవారం రాత్రి అటుగా వచ్చిన చిరుత దాంట్లో ఇరుక్కుపోయింది. అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి చిరుతను క్షేమంగా కాపాడి తరలించారు.