బనశంకరి: అక్రమంగా గోమాంసం తరలిస్తున్న వాహనాలపై దాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన శ్రీరామసేన కార్యకర్తలు 48 రోజుల అనంతరం శనివారం విడుదలయ్యారు. శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు వద్ద కార్యకర్తలకు స్వాగతం పలికారు. సెప్టెంబరు 23న దొడ్డబళ్లాపుర టీబీ క్రాస్ వద్ద అక్రమంగా గోమాంసాన్ని హిందూపురం నుంచి శివాజీనగ కు ఏడు బొలెరో, టాటా ఇండికా కార్లలో తరలిస్తున్నారని తెలిసి కార్యకర్తలు దాడిచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 16 మంది కార్యకర్తలను అరెస్ట్చేసి జైలుకు తరలించారు. వారికి బెయిలు లభించింది.
విజయేంద్రకు ఇవ్వాలని అడగలేదు: యడ్డి
శివాజీనగర: బీజేపీ రాష్ట్రాధ్యక్షునిగా కుమారుడు బీ.వై.విజయేంద్రను నియమించాలని ఎవరినీ అడగలేదు, పార్టీ హైకమాండే ఎంపిక చేసింది అని మాజీ సీఎం బీ.ఎస్.యడియూరప్ప అన్నారు. శనివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన రాబోయే లోక్సభ ఎన్నికల్లో 25కు పైగా స్థానాలను గెలవడమే లక్ష్యమని, అందరూ కలసికట్టుగా పని చేస్తామని తెలిపారు. విజయేంద్ర నియామకం అందరికీ ఆమోదయోగ్యమని ఎంపీ పీ.సీ.మోహన్ చెప్పారు. లోక్సభా ఎన్నికలను విజయేంద్ర నేతృత్వంలోనే ఎదుర్కొంటామని తెలిపారు.