చిటపటల జోరుకు బ్రేక్‌

12 Nov, 2023 01:22 IST|Sakshi

బనశంకరి: అత్తిబెలె వద్ద ఇటీవల టపాసుల గోదాములో పేలుడు జరిగి 17 మంది దుర్మరణం చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం టపాసుల అమ్మకాలపై కఠిన ఆంక్షలను విధించడం ఈ దీపావళిపై ప్రభావం చూపింది. నగరంలోనే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల టపాసులు వ్యాపార కార్యకలాపాలు తక్కువగా ఉన్నాయి. దశాబ్దాలుగా కూడళ్లు, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్న టపాసులు దుకాణాలను అత్తిబెలె పేలుడు తరువాత అధికారులు మూయించేశారు. 35 రోజుల నుంచి రెవెన్యూ, పోలీసు, ఫైర్‌ అధికారులు ప్రతి షాపును తనిఖీ చేసి లైసెన్స్‌, ఇతర నియమాలను పరిశీలించి అన్నీ బాగున్నప్పటికీ షాపులను తెరవరాదన్నారు. బెంగళూరులోనే 270 స్టాళ్లు మూతపడ్డాయి. దీంతో దీపావళి పండుగకు నెలల ముందే భారీ మొత్తంలో టపాసులు తెప్పించిన దుకాణదారులు, వ్యాపారులు ప్రభుత్వ కఠిన చర్యలతో అవాక్కయ్యారు.

2 గంటలు మాత్రమే కాల్చాలి

ఒక్కో లేఔట్‌లో బహిరంగ మైదానంలో మాత్రమే సామూహిక టపాసుల అంగళ్లకు అనుమతించారు. మరోవైపు టపాసుల వ్యాపారులకు కొనుగోలుదారులు ఫోన్లు చేసి ఇంటికే తెప్పించుకోవడం పెరిగింది. కాగా ఐటీ సిటీతో పాటు రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యనే టపాసులు కాల్చాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ని నియమాల మధ్య వ్యాపారులు కూడా ధరలను పెంచేయడంతో సామాన్య ప్రజలు అవస్థలు పడ్డారు.

15 ఏళ్లుగా అమ్మేవాడిని

గత 15 ఏళ్లుగా లైసెస్సు కలిగిన దుకాణం పెట్టుకుని ఏడాదంతా టపాసులు విక్రయించేవాడినని, ఈసారి లైసెన్సు రద్దుచేశారు. నెలక్రితం లక్షలాది రూపాయలుపెట్టుబడి పెట్టి టపాసులు తెప్పించా, ఏం చేయాలో దిక్కుతోచడం లేదు అని బెంగళూరుకి చెందిన టపాసుల వ్యాపారి సీ.రాజా చెప్పారు.

ముందే చెప్పొచ్చు కదా

పటాకుల దుకాణాలను మూసివేయడంతో వందలాది వ్యాపారులు, కార్మికులు వీధిన పడ్డారు. ఇలాంటి కఠిన నిర్ణయాలు పండుగ ముందు కాకుండా కొన్ని నెలల కిందటే చెప్పి ఉంటే వ్యాపారమే చేసేవారం కాదని అత్తిబెలె టపాసులు వ్యాపారి శరవణ అన్నారు. అలాగే టపాసుల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల పన్నులు కూడా రాకుండా పోయాయన్నారు.

బెంగళూరు వయ్యాలి కావల్‌లో

టపాసుల విక్రయాలు

కఠిన ఆంక్షలతో అంతటా టపాసుల

షాపులు తగ్గుముఖం

మరిన్ని వార్తలు